బౌలర్లకు సహకరిస్తున్న పిచ్పై సీనియర్ ఓపెనర్ శిఖర్ ధవన్ సంయమనంతో కూడిన ఇన్నింగ్స్తో ఆకట్టుకోవడంతో ఐపీఎల్లో పంజాబ్ నాలుగో విజయం నమోదు చేసుకుంది. గబ్బర్ బ్యాటింగ్ మెరుపులకు రబడ, రిషి ధవన్ బౌలింగ్ తోడవడంతో చెన్నైకి నిరాశ తప్పలేదు. మహేంద్రసింగ్ ధోనీ గత మ్యాచ్ మాదిరిగానే ఫినిషింగ్ టచ్ ఇవ్వాలని చూసినా అది సాధ్యపడకపోగా.. అంబటి రాయుడు మెరుపులు వృథా అయ్యాయి!
ముంబై: ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న పంజాబ్ కింగ్స్.. ఐపీఎల్ 15వ సీజన్లో నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. సోమవారం జరిగిన పోరులో పంజాబ్ 11 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్పై విజయం సాధించింది. వాంఖడే మైదానంలో వరుసగా ఐదో మ్యాచ్లోనూ తొలుత బ్యాటింగ్ చేసిన జట్టే గెలుపొందడం గమనార్హం. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. సీనియర్ ఓపెనర్ శిఖర్ ధవన్ (59 బంతుల్లో 88 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్తో ఆకట్టుకోగా.. భానుక రాజపక్సే (42; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. వీరిద్దరు రెండో వికెట్కు 110 పరుగులు జతచేయడం విశేషం.
కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (18) మరోసారి నిరాశ పరచగా.. లియామ్ లివింగ్ స్టోన్ (7 బంతుల్లో 19; ఒక ఫోర్, 2 సిక్సర్లు) ఉన్నంతసేపు మెరుపులు మెరిపించాడు. చెన్నై బౌలర్లలో డ్వైన్ బ్రేవో రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు చేసింది. రాబిన్ ఊతప్ప (1), శాంట్నర్ (9), శివమ్ దూబే (8) విఫలమవగా.. తెలుగు ఆటగాడు అంబటి రాయుడు (39 బంతుల్లో 78; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) దంచికొట్టాడు. అయితే కీలక సమయంలో రాయుడు ఔట్ కాగా.. ఆఖర్లో జడేజా (21 నాటౌట్), మహేంద్రసింగ్ ధోనీ (8 బంతుల్లో 12; ఒక ఫోర్, ఒక సిక్సర్) ఆశించినంత వేగంగా ఆడలేకపోవడంతో చెన్నైకి నిరాశ తప్పలేదు. పంజాబ్ బౌలర్లలో రబడ, రిషి ధవన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ధవన్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. లీగ్లో భాగంగా మంగళవారం బెంగళూరుతో రాజస్థాన్ తలపడనుంది.
గబ్బర్ యాంకర్ రోల్..
టాపార్డర్లో నిలకడ కొనసాగిస్తున్న శిఖర్ ధవన్ మరో చక్కటి ఇన్నింగ్స్తో అదరగొట్టాడు. చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నా.. ఓపికగా క్రీజులో నిలిచిన గబ్బర్ (ధవన్ ముద్దు పేరు) వీలు చిక్కినప్పుడల్లా భారీ షాట్లు ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన పంజాబ్కు శుభారంభం దక్కలేదు. తొలి ఐదు ఓవర్లలో కింగ్స్ 29 పరుగులే చేయగా.. తదుపరి ఓవర్లో మయాంక్ ఔటయ్యాడు. దీంతో పవర్ ప్లే ముగిసే సరికి పంజాబ్ 37/1తో నిలిచింది. ముఖేశ్ చౌదరి వేసిన 12వ ఓవర్లో మూడు ఫోర్లతో ధవన్ జోరు పెంచగా.. ప్రిటోరియస్ ఓవర్లో రాజపక్స చూడచక్కటి సిక్సర్తో అలరించాడు. ఈ క్రమంలో గబ్బర్ 37 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకోగా.. రాజపక్స అతడికి చక్కటి సహకారం అందించాడు. రెండో వికెట్కు 71 బంతుల్లో 110 పరుగులు జోడించాక రాజపక్స ఔట్ కాగా.. క్రీజులో ఉన్నంతసేపు లివింగ్స్టోన్ ధాటిగా ఆడాడు. ప్రిటోరియస్ వేసిన 19 ఓవర్లో అతడు వరుసగా 4,6,6 అరుసుకున్నాడు. ఆఖరి ఓవర్లో ధవన్ ఒక సిక్సర్ బాదడంతో పంజాబ్ మంచి స్కోరు చేయగలిగింది. చివరి ఐదు ఓవర్లలో పంజాబ్ 64 పరుగులు పిండుకుంది.
రాయుడు రాణించినా..
లక్ష్యఛేదనలో చెన్నైకి శుభారంభం దక్కలేదు. ఓపెనర్ రాబిన్ ఊతప్ప, శాంట్నర్, దూబే ఒకరి వెంట ఒకరు పెవిలియన్కు వరుస కట్టడంతో చెన్నై 40 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో గైక్వాడ్ (30)తో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దిన రాయుడు.. క్రీజులో కుదురుకున్నాక భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. చెన్నై విజయానికి 42 బంతుల్లో 98 పరుగులు చేయాల్సిన దశలో రాయుడు చెలరేగిపోయాడు. సందీప్ వేసిన 14వ ఓవర్లో రెండు ఫోర్లు బాదిన అంబటి.. తదుపరి ఓవర్లో 6,4 అరుసుకున్నాడు. ఇక 16వ ఓవర్ వేసిన సందీప్ శర్మకు రాయుడు చుక్కలు చూపించాడు. మూడు సిక్సర్లు, ఓ ఫోర్తో చెలరేగడంతో సమీకరణం 18 బంతుల్లో 41కి చేరింది. అయితే ఫుల్ జోష్లో ఉన్న రాయుడును రబడ ఓ చక్కటి యార్కర్తో ఔట్ చేయగా.. ఆఖర్లో జడేజా వేగంగా పరుగులు సాధించలేకపోయాడు. రెండు ఓవర్లలో 35 పరుగులు చేయాల్సిన దశలో 19వ ఓవర్లో అర్శ్దీప్ 8 పరుగులే ఇవ్వగా.. గత మ్యాచ్లో మెరుపులు మెరిపించిన ధోనీ మరోసారి ఫినిషింగ్ టచ్ ఇస్తాడని భావించినా అదీ సాధ్యపడలేదు. తొలి బంతికి భారీ సిక్సర్తో అలరించిన ధోనీ మూడో బంతికి పెవిలియన్ చేరడంతో చెన్నైకి పరాజయం తప్పలేదు.
స్కోరు బోర్డు
పంజాబ్: మయాంక్ (సి) దూబే (బి) తీక్షణ 18, ధవన్ (నాటౌట్) 88, రాజపక్స (సి) దూబే (బి) బ్రేవో 42, లివింగ్స్టోన్ (సి) ముఖేశ్ (బి) బ్రేవో 19, బెయిర్స్టో (రనౌట్) 6, ఎక్స్ట్రాలు: 14, మొత్తం: 20 ఓవర్లలో 187/4. వికెట్ల పతనం: 1-37, 2-147, 3-174, 4-187, బౌలింగ్: ముఖేశ్ 4-0-36-0, తీక్షణ 4-0-32-1, శాంట్నర్ 2-0-8-0, జడేజా 2-0-18-0, ప్రిటోరియస్ 4-0-50-0, బ్రేవో 4-0-42-2.
చెన్నై: గైక్వాడ్ (సి) మయాంక్ (బి) రబడ 30, ఊతప్ప (సి) రిషి ధవన్ (బి) సందీప్ 1, శాంట్నర్ (బి) అర్శ్దీప్ 9, దూబే (బి) రిషి ధవన్ 8, రాయుడు (బి) రబడ 78, జడేజా (నాటౌట్) 21, ధోనీ (సి) బెయిర్స్టో (బి) రిషి ధవన్ 12, ప్రిటోరియస్ (నాటౌట్) 1, ఎక్స్ట్రాలు: 16, మొత్తం: 20 ఓవర్లలో 176/6. వికెట్ల పతనం: 1-10, 2-30, 3-40, 4-89, 5-153, 6-168, బౌలింగ్: రబడ 4-0-23-2, సందీప్ 4-0-40-1, రిషి ధవన్ 4-0-39-2, అర్శ్దీప్ 4-0-23-1, రాహుల్ చాహర్ 3-0-30-0, లివింగ్స్టోన్ 1-0-12-0.