దేశవాళీ క్రికెట్లో భాగంగా జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (స్మాట్) – 2023లో పంజాబ్ జట్టు రికార్డు విజయాన్ని అందుకుంది. ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడే పంజాబ్ ఓపెనర్ అభిషేక్ శర్మతో పాటు అన్మోల్ప్రీత్ సింగ్లు వీరబాదుడు బాదడంతో ఆ జట్టు.. ఆంధ్రప్రదేశ్పై ఘనవిజయాన్ని అందుకుంది. స్మాట్ – 2023లో భాగంగా ఆంధ్రా – పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్లో.. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 275 పరుగుల భారీ స్కోరు చేసింది. స్మాట్తో పాటు భారత టీ20 క్రికెట్ చరిత్రలో ఇది అత్యధిక స్కోరు కావడం గమానర్హం.
రాంచీలోని జేఎస్సీఏ అంతర్జాతీయ స్టేడియం వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్లో అభిషేక్ శర్మ.. 46 బంతుల్లోనే శతకం బాదాడు. మొత్తంగా 51 బంతులను ఎదుర్కున్న అభిషేక్.. 9 బౌండరీలు 9 సిక్సర్ల సాయంతో 112 పరుగులు చేశాడు. ఇక మిడిలార్డర్లో వచ్చిన అన్మోల్ప్రీత్ సింగ్ అయితే శివాలెత్తాడు. సిక్సర్లు, ఫోర్లతో ఆంధ్రా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 17 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేసుకున్న అన్మోల్.. మొత్తంగా 26 బంతుల్లోనే ఆరు బౌండరీలు, తొమ్మిది భారీ సిక్సర్లతో 87 పరుగులు సాధించాడు. ఒకదశలో అన్మోల్.. పొట్టి ఫార్మాట్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేస్తాడని అనిపించేంతగా సాగిన అతడి విధ్వంసానికి ఎట్టకేలకు 17వ ఓవర్లో ఆఖరుబంతికి వెనుదిరిగాడు.
అనంతరం భారీ ఛేదనలో ఆంధ్రా.. నిర్ణీత 20 ఓవర్లలో 170 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆంధ్రా తరఫున రికీ భుయ్ సెంచరీ (52 బంతుల్లో 104, 6 ఫోర్లు, 9 సిక్సర్లు) ధాటిగా ఆడినా మిగిలినవారంతా విఫలమయ్యారు. ఫలితంగా ఆ జట్టు 105 పరుగుల తేడాతో దారుణ ఓటమి మూటగట్టుకుంది.
కాగా పొట్టి ఫార్మాట్లో దేశవాళీతో పాటు ఐపీఎల్లో కూడా ఇదే అత్యధిక స్కోరు. స్మాట్లో హయ్యస్ట్ టోటల్ చేసిన ఘనత గతంలో ముంబై టీమ్ పేరిట ఉంది. 2019లో ముంబై.. సిక్కీంపై 258-4 పరుగుల భారీ స్కోరు చేసింది. 2019లోనే ఆంధ్రా.. మణిపూర్పై 252-4, కర్నాటక.. సర్వీసెస్పై 250-3 పరుగుల భారీ స్కోర్లు సాధించింది.
ఇక పురుషుల టీ20 క్రికెట్ (అంతర్జాతీయ స్థాయి)లో అత్యధిక స్కోర్లు నమోదుచేసిన జట్ల జాబితా చూస్తే.. నేపాల్ (314-3, మంగోలియాపై), అఫ్గానిస్తాన్ (278-3, ఐర్లాండ్పై), చెక్ రిపబ్లిక్ (278-4, టర్కీపై)లు మాత్రమే పంజాబ్ కంటే ముందున్నాయి.