పిట్ట కొంచం కూత ఘనం అన్నట్లు.. ప్రభ్సిమ్రన్ సెంచరీతో చెలరేగడంతో ఐపీఎల్లో పంజాబ్ ఆరో విజయం నమోదు చేసుకుంది. ఢిల్లీతో పోరులో ఆల్రౌండ్ ఆధిక్యం కనబర్చిన ధవన్ సేన.. పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి ఎగబాకింది.
న్యూఢిల్లీ: యువ ఓపెనర్ ప్రభ్సిమ్రన్ సింగ్ (65 బంతుల్లో 103; 10 ఫోర్లు, 6 సిక్సర్లు) శతక్కొట్టడంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్లో పంజాబ్ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. శనివారం జరిగిన రెండో మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ 31 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ను చిత్తు చేసింది. తాజా సీజన్లో వార్నర్ సేనకు ఇది 8వ పరాజయం కాగా.. ఆ జట్టు ప్లే ఆఫ్స్ రేసుకు దూరమైంది.
మొదట పంజాబ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ప్రభ్సిమ్రన్ ఒంటరి పోరాటం చేయగా.. 20 పరుగులు చేసిన సామ్ కరన్ రెండో అత్యధిక స్కోరర్ అంటే పంజాబ్ ఇన్నింగ్స్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. కెప్టెన్ శిఖర్ ధవన్ (7), లివింగ్స్టోన్ (4), జితేశ్ శర్మ (5), షారుక్ ఖాన్ (2)విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్ శర్మ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో ఢిల్లీ 18.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 130 రన్స్కు పరిమితమైంది.
కెప్టెన్ డేవిడ్ వార్నర్ (27 బంతుల్లో 54; 10 ఫోర్లు, ఒక సిక్సర్), ఫిల్ సాల్ట్ (21) రాణించడంతో ఒక దశలో 69/0తో పటిష్టంగా కనిపించిన ఢిల్లీ ఆ తర్వాత.. హర్ప్రీత్ (4/30), రాహుల్ చాహర్ (2/16) ధాటికి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. మిషెల్ మార్ష్ (3), రాసో (5), అక్షర్ (1), మనీశ్ పాండే (0) పెవిలియన్కు వరుస కట్టారు. పంజాబ్ బౌలర్లలో హర్ప్రీత్, రాహుల్ చాహర్తో పాటు నాథన్ ఎలీస్ (2/21) రాణించాడు. ప్రభ్సిమ్రన్ సింగ్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
సంక్షిప్త స్కోర్లు
పంజాబ్: 167/7 (ప్రభ్సిమ్రన్ 103, కరన్ 20; ఇషాంత్ 2/27),
ఢిల్లీ: 130/8 (వార్నర్ 54, సాల్ట్ 21; హర్ప్రీత్ 4/30).