ఇటీవలే కోల్కతా వేదికగా టీ20 క్రికెట్లో అత్యధిక ఛేదన (262)ను మరో 8 బంతులు మిగిలుండగానే పూర్తిచేసి రికార్డులు సృష్టించిన పంజాబ్ కింగ్స్ చెన్నైలో బంతితో మెరిసింది. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) సొంతగ్రౌండ్ చెపాక్లో ఆ జట్టును తక్కువ స్కోరుకే కట్టడిచేసి తర్వాత లక్ష్యాన్ని నెమ్మదిగా పూర్తిచేసింది. స్పిన్నర్లు చాహర్, బ్రర్.. చెన్నై దూకుడుకు చెక్ పెట్టారు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తప్ప మిగిలినవారంతా విఫలమయ్యారు. ఛేదనలో పంజాబ్ మరీ ధాటిగా ఆడకపోయినా లక్ష్యాన్ని పూర్తిచేసి ఈ సీజన్లో నాలుగో విజయాన్ని నమోదుచేసింది.
IPL | చెన్నై: పంజాబ్ కింగ్స్ మరోసారి సమిష్టి ప్రదర్శనతో రాణించి చెన్నై సూపర్ కింగ్స్ సొంత డెన్ అయిన చెపాక్లో రుతురాజ్ సేనకు చెక్ పెట్టింది. బుధవారం సీఎస్కేతో జరిగిన మ్యాచ్లో ఆతిథ్య జట్టును 163 పరుగులకే కట్టడిచేసిన పంజాబ్.. లక్ష్యాన్ని 17.5 ఓవర్లలో పూర్తిచేసి 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత చెన్నైని పంజాబ్ కట్టడిచేయడంతో 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులకే పరిమితమైంది. రుతురాజ్(48 బంతుల్లో 62, 5 ఫోర్లు, 2 సిక్సర్లు) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పంజాబ్ స్పిన్నర్లు రాహుల్ చాహర్ (2/16), హర్ప్రీత్ బ్రర్ (2/17) సీఎస్కే భారీ స్కోరు చేయకుండా కట్టడిచేశారు. అనంతరం ఛేదనలో పంజాబ్.. 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని పూర్తిచేసింది. బెయిర్ స్టో ( 46), రిలీ రూసో (43) ధాటిగా ఆడారు. హర్ప్రీత్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
ఈ సీజన్లో నిలకడగా రాణిస్తున్న రుతురాజ్ గైక్వాడ్ మరోసారి చెన్నైకి ఆపద్బాంధవుడిగా నిలిచాడు. సీఎస్కే ఇన్నింగ్స్ తొలి 4 ఓవర్లలో వికెట్లను కాపాడుకోవడానికి ప్రాధాన్యమిచ్చిన రుతురాజ్-రహానే (24 బంతుల్లో 29, 5 ఫోర్లు) ఐదు, ఆరో ఓవర్లో బౌండరీలతో పంజాబ్ బౌలర్లపై దాడికి దిగారు. దీంతో చెన్నై స్కోరు వేగం పుంజుకున్నట్టే అనిపించింది. కానీ హర్ప్రీత్ బ్రర్ ఒకే ఓవర్లో రహానే, దూబేను ఔట్ చేసి చెన్నైకి షాకిచ్చాడు. మరుసటి ఓవర్లో రాహుల్ చాహర్.. జడేజా (2)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో ఆ జట్టు కష్టాలు మరింత రెట్టింపయ్యాయి. 7-15 ఓవర్ల మధ్య స్పిన్నర్లతో పాటు రబాడా చెన్నైని కట్టడిచేయడంతో ఆ జట్టు 47 పరుగులు మాత్రమే చేయగలిగింది. సమీర్ రిజ్వి (21) నెమ్మదిగా ఆడాడు. కరన్ వేసిన 17వ ఓవర్లో సిక్సర్తో అర్ధ సెంచరీ పూర్తిచేసిన గైక్వాడ్.. ఆ ఓవర్లో 20 పరుగులు రాబట్టాడు. అర్ష్దీప్ 18వ ఓవర్లో అతడు ఔట్ అయినా ఆఖర్లో ధోనీ (11 బంతుల్లో 14, 1 ఫోర్, 1 సిక్సర్) మెరుపులతో ఆ జట్టు గౌరవప్రదమైన స్కోరు చేసింది.
లక్ష్య ఛేదనలో పంజాబ్ ఆరంభంలోనే ఓపెనర్ ప్రభ్సిమ్రన్ (13) వికెట్ను కోల్పోయింది. కానీ గత మ్యాచ్ హీరో బెయిర్ స్టో.. మూడో స్థానంలో వచ్చిన రూసోతో కలిసి పంజాబ్ ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లాడు. ముస్తాఫిజుర్ 5వ ఓవర్లో రూసో రెండు బౌండరీలు బాదగా శార్దూల్, జడేజా, మోయిన్ అలీ ఓవర్లలో ఓవర్కు రెండు ఫోర్లకు తగ్గకుండా దంచాడు. కానీ ప్రమాదకరంగా పరిణమిస్తున్న ఈ జోడీని దూబే విడదీశాడు. అతడు వేసిన పదో ఓవర్లో బెయిర్ స్టో.. ధోనీకి క్యాచ్ ఇవ్వడంతో 64 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. దూకుడుగా ఆడుతున్న రూసోను ఠాకూర్ 12వ ఓవర్లో క్లీన్బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత చెన్నై సారథి పంజాబ్ బ్యాటర్లపై ఒత్తిడి తెచ్చేందుకు యత్నించినా శశాంక్ సింగ్ (25 నాటౌట్), సారథి సామ్ కరన్ (26 నాటౌట్) లు సీఎస్కేకు ఆ అవకాశమివ్వలేదు.
చెన్నై: 20 ఓవర్లలో 162/7 (రుతురాజ్ 62, రహానే 29, చాహర్ 2/16, బ్రర్ 2/17).
పంజాబ్: 17.5 ఓవర్లలో 163/3 (బెయిర్ స్టో 46, రూసో 43, దూబే 1/14, గ్లీసన్ 1/30)