Cheteshwar Pujara | భారత టెస్టు స్టెషలిస్ట్ చతేశ్వర్ పుజారాపై సస్పెన్షన్ వేటు పడింది. టీమ్ఇండియా టెస్టు జట్టులో చోటు కోల్పోయిన పుజారా ప్రస్తుతం ఇంగ్లండ్ కౌంటీ చాంపియన్షిప్లో ససెక్స్ టీమ్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే ఈ టోర్నీలో భాగంగా ససెక్స్ ఆటగాళ్లు నిబంధనలను ఉల్లంఘించడంతో ఆ జట్టుకు 12 డీ మెరిట్ పాయింట్స్ విధించారు. దీంతో పుజారాపై ఓ మ్యాచ్ నిషేధం పడింది. ప్రస్తుతం ససెక్స్ జట్టుకు పుజారా సారథిగా వ్యవహరిస్తుండగా.. నిబంధనల ప్రకారం ఒక సీజన్లో ఏదేనీ జట్టు 12 డీ మెరిట్ పాయింట్లు సాధిస్తే.. ఆ జట్టు కెప్టెన్ నిషేధం ఎదుర్కోవాల్సి ఉంటుంది. తాజా సీజన్లో ససెక్స్ జట్టుకు నాలుగు ఫిక్స్డ్ పెనాల్టీలతో 12 డీ మెరిట్ పాయింట్స్ పొందింది.
మైదానంలో ప్రత్యర్థి ఆటగాళ్లతో వ్యవహరించే తీరును బట్టి డీ మెరిట్ పాయింట్స్ కేటాయిస్తారు. టోర్నీ తొలి దశలో రెండు ఫిక్స్డ్ పెనాల్టీలను ఎదుర్కొన్న ససెక్స్.. సెప్టెంబర్ 13న లీసెస్ట్షైర్తో జరిగిన పోరులో మరో రెండు పెనాల్టీలను పొందింది. దీంతో ఎలాంటి వాదనలకు తావు లేకుండా పుజారాపై ఒక మ్యాచ్ నిషేధం విధించారు. ససెక్స్ ప్లేయర్లు టామ్ హెయిన్స్, జాక్ కార్సన్, అది కార్వెలాస్లు గొడవ పడటంతో ఈ మ్యాచ్ వార్తల్లోకెక్కింది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం 124 పాయింట్లతో ససెక్స్ మూడో ఐదో స్థానానికి పడిపోగా.. డర్హమ్ 198 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నది. భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న పుజారాకు ఈ నిషేధం ఎదురుదెబ్బగా నిలువనుంది