బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్లో తొలి విజయం కోసం ఎదురు చూస్తున్న తెలుగు టైటాన్స్కు నిరీక్షణ తప్పడం లేదు. ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ గెలుపు రుచి చూడని టైటాన్స్.. శనివారం బెంగళూరు బుల్స్తో పోరును ‘టై’ చేసుకుంది. ఆఖరి రైడ్ వరకు ఆధిపత్యంలో కొనసాగిన టైటాన్స్.. అనవసర తప్పిదాలతో ఆఖరికి 34-34తో మ్యాచ్ను ‘డ్రా’ చేసుకుంది. టైటాన్స్ తరఫున అంకిత్ 10 పాయింట్లతో విజృంభించగా.. ఆదర్శ్ (5), రాకేశ్ (4), సందీప్ (4) రాణించారు. బెంగళూరు తరఫున కెప్టెన్ పవన్ షెరావత్ (8), చంద్రన్ రంజిత్ (9) సత్తాచాటారు. యూ ముంబా, యూపీ యోధా మధ్య జరిగిన మరో మ్యాచ్ 28-28తో ‘డ్రా’ కాగా.. దబంగ్ ఢిల్లీ, తమిళ్ తలైవాస్ మధ్య జరిగిన ఆఖరి మ్యాచ్ 30-30తో డ్రాగా ముగిసింది.