బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్ లీగ్ దశ ముగిసింది. వరుస విజయాలతో విజృంభించిన పట్నా టేబుల్ టాపర్గా ప్లే ఆఫ్స్కు చేరగా.. దబంగ్ ఢిల్లీ, యూపీ యోధా, గుజరాత్ జెయింట్స్, బెంగళూరు బుల్స్, పుణెరీ పల్టన్ కూడా నాకౌట్ దశకు అర్హత సాధించాయి. సీజన్ ఆరంభం నుంచి పరాజయాల పరంపర కొనసాగించిన తెలుగు టైటాన్స్ 22 మ్యాచ్లాడి ఒక్క విజయంతోనే పట్టిక చివరి స్థానంతో సరిపెట్టుకుంది. శనివారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో పట్నా పైరెట్స్ 30-27తో హర్యానా స్టీలర్స్పై విజయం సాధించింది. దీంతో తాజా సీజన్లో 22 మ్యాచ్లాడిన పట్నా.. 16 విజయాలు సాధించి 86 పాయింట్లతో పట్టిక అగ్రస్థానంలో నిలిచింది. ఇతర మ్యాచ్ల్లో గుజరాత్ జెయింట్స్ 36-33తో యూ ముంబాపై, పుణెరీ పల్టన్ 37-30తో జైపూర్ పింక్ పాంథర్స్పై విజయాలు సాధించాయి. సోమవారం జరుగనున్న ఎలిమినేటర్ మ్యాచ్ల్లో యూపీ యోధాతో పుణెరీ పల్టన్, గుజరాత్ జెయింట్స్తో బెంగళూరు బుల్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.