న్యూఢిల్లీ: భారత క్రీడా రంగంలో స్వర్ణ యుగం ఆరంభమైందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. శనివారం ఆయన కామన్వెల్త్ క్రీడల బృందాన్ని తన నివాసంలో సన్మానించారు. ఇటీవల ముగిసిన కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారులు అసమాన ప్రతిభ కనబర్చి 61 పతకాలు సాధించడం మరువలేనిదన్నారు. క్రీడల్లో ఆటగాళ్ల ప్రతిభను పతకాల సంఖ్యతో పోల్చడం సరికాదని, కామన్వెల్త్లో మన క్రీడాకారులు చాలా విభాగాలలో అంతర్జాతీయ ఆటగాళ్లకు గట్టి పోటీ ఇచ్చారన్నారు.
ఒక సెకను లేదా ఒక సెంటీమీటరు తేడాతో పతకాలు కోల్పోయిన వారున్నారని, భవిష్యత్తులో వారు పతకాలు సాధిస్తారన్న నమ్మకముందన్నారు. బర్మింగ్హామ్లో బ్యాడ్మింటన్, రెజ్లింగ్, వెయిట్లిఫ్టింగ్, టేబుల్ టెన్నిస్, బాక్సింగ్, అథ్లెటిక్స్తో పాటు కొత్తగా ప్రవేశపెట్టిన క్రీడల్లోనూ మనవాళ్లు మెడల్స్ నెగ్గడం ప్రశంసనీయమన్నారు.
దేశం స్వాతంత్య్ర వజ్రోత్సవాలు జరుపుకుంటున్న నేపథ్యంలో మన క్రీడాకారులు పతకాల పంట పండించడం యాదృచ్ఛికం అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ బాక్సర్, ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్ తన గ్లవ్స్పై ప్రధాని సంతకం తీసుకోవడం విశేషం.