టోక్యో: పారాలింపిక్స్లో వరుసగా రెండో రోజు భారత్కు నిరాశ తప్పలేదు. గురువారం టోక్యోలో జరిగిన బ్యాడ్మింటన్, కనోయి స్ప్రింట్ మినహా మిగతా ఈవెంట్లలో భారత్కు నిరాశే ఎదురైంది. వరల్డ్ నంబర్వన్ షట్లర్ ప్రమోద్ భగత్ పారాలింపిక్స్ పురుషుల బ్యాడ్మింటన్ సెమీస్లోకి ప్రవేశించగా.. సుహాస్ యతిరాజ్, తరుణ్ దిల్లాన్, కృష్ణ తదుపరి రౌండ్లకు అర్హత సాధించారు. పురుషుల క్లాస్ ఎస్ఎల్-3 గ్రూప్-ఏ రెండో మ్యాచ్లో భగత్ 21-12, 21-9తో ఒలెక్సండ్ చిర్కోవ్ (ఉక్రేనియా)పై గెలిచాడు. 26 నిమిషాల్లోనే ముగిసిన మ్యాచ్లో భగత్.. ప్రత్యర్థిపై మ్యాచ్ ఆసాంతం ఆధిక్యం ప్రదర్శించాడు.
మరోవైపు ఎస్ఎల్-3, ఎస్యు-5 విభాగంలో జరిగిన మహిళల డబుల్స్ ఈవెంట్లో భారత ద్వయం పాలక్ కోహ్లీ-పారుల్ పర్మార్ జోడీ 7-21, 5-21 తేడాతో చెంగ్ హెఫాంగ్-మ హుయిహుయి ద్వయం(చైనా) చేతిలో ఓటమి పాలయ్యారు. కానీ ఎస్యు-5 మహిళల సింగిల్స్లో కోహ్లీ 21-12, 21-19, 15-21 తేడాతో జెహ్రా(టర్కీ)ని చిత్తు చేసింది.
సెమీస్లో ప్రాచి యాదవ్
కనోయి స్ప్రింట్లో బరిలోకి దిగిన ప్రాచి యాదవ్ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. మహిళల వీఎల్-2 విభాగంలో బరిలోకి దిగిన ఈ 26 ఏండ్ల భోపాల్ అథ్లెట్.. 200 మీటర్ల ఈవెంట్లో 1 నిమిషం 11.09 సెకన్లలో లక్ష్యాన్ని చేరి రెండో స్థానంలో నిలిచింది. ఈ పోటీలలో బ్రిటన్కు చెందిన ఎమ్మా విగ్స్ 58.084 సెకన్లలోనే గమ్యం చేరి తొలి స్థానాన్ని సాధించింది.
షూటింగ్, షాట్పుట్లోనూ నిరాశే..
పురుషుల 25 మీటర్ల పిస్టల్ ఎస్హెచ్1 ఈవెంట్లో భారత షూటర్ రాహుల్ జాకర్ పారాలింపిక్స్లో తన ప్రస్థానాన్ని ముగించాడు.