ఒస్లో: నార్వే చెస్ టోర్నీలో పోటీ రసవత్తరంగా మారింది. టోర్నీ ఆదిలో ఒకింత ఒడిదుడుకులు ఎదుర్కొన్న భారత యువ గ్రాండ్మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద అద్భుతంగా పుంజుకుని టైటిల్ రేసులోకి దూసుకొచ్చాడు. ఆఖరి రౌండ్ మిగిలున్న టోర్నీలో ప్రజ్ఞానంద ప్రస్తుతం 15 పాయింట్లతో టేబుల్ టాపర్ అమెరికా జీఎం వెస్లె సో(15.5) తర్వాత రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. శుక్రవారం జరిగిన ఓపెన్ విభాగం తొమ్మిదో రౌండ్లో ప్రజ్ఞానంద 1-0తో ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్పై అద్భుత విజయం సాధించాడు. తద్వారా మూడు పాయింట్లు ఖాతాలో వేసుకున్న ప్రజ్ఞానంద రెండో స్థానంలోకి దూసుకొచ్చాడు. ఫ్రాన్స్కు చెందిన అలీరెజా ఫిరౌజా(14.5) మూడులో కొనసాగుతున్నాడు. ఈ ముగ్గురిలో ఎవరూ గెలిచిన వారికి ఇది తొలి నార్వే టైటిల్ కానుంది.
గుకేశ్తో పోరు విషయానికొస్తే..నల్లపావులతో బరిలోకి దిగిన ప్రజ్ఞానంద పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగుతూ నిమ్జో-ఇండియన్ సామ్సిచ్ వ్యూహంతో ముందుకు సాగాడు. గత గేమ్లో చేసిన తప్పులను పునరావృతం చేయకుండా జాగ్రత్తపడ్డ ప్రజ్ఞానంద..గుకేశ్ పుంజుకునేందుకు ఎలాంటి అవకాశమివ్వలేదు. తన ఆఖరి పోరులో జర్మనీకి చెందిన విన్సెంట్ కెయ్మర్తో ప్రజ్ఞానంద తలపడనున్నాడు. మహిళల విభాగంలో కజకిస్థాన్ జీఎం బిబిసారా అసబయేవా మరో రౌండ్ మిగిలుండగానే టైటిల్ను తన ఖాతాలో వేసుకుంది. ఆఖరి గేమ్లో అన్నా ముజుచుక్ చేతిలో ఓడినా బిబిసారా స్పష్టమైన ఆధిక్యంతో విజేతగా నిలిచింది.