IND vs SA: వన్డే ప్రపంచకప్లో భారత్ జైత్రయాత్రను పురస్కరించుకుని చేసుకున్న వేడుకలు ఓ మూగజీవి ప్రాణం తీశాయి. ఈడెన్ గార్డెన్స్ వేదికగా రెండ్రోజుల క్రితం భారత్.. సౌతాఫ్రికాల మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో టీమిండియా గెలిచిన తర్వాత స్టేడియంలో సుమారు ఐదు నిమిషాల పాటు బాణసంచా కాల్చడంతో ఆ శబ్దానికి జడుసుకున్న గుర్రం ప్రాణాలు కోల్పోయింది. మృతిచెందిన ఆ గుర్రం కోల్కతా పోలీసు విభాగానికి చెందినది కావడం గమనార్హం.
ఈనెల ఐదున ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్ – సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ జరుగగా ఈ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. సరిగ్గా అదే రోజు తన 35వ పుట్టినరోజు జరుపుకున్న కోహ్లీ.. వన్డేలలో సచిన్ టెండూల్కర్ అత్యధిక సెంచరీ (49)ల రికార్డును సమం చేశాడు. అయితే ఛేదనలో సఫారీలు 27.1 ఓవర్లలో 83 పరుగులకే కుప్పకూలారు. రవీంద్ర జడేజా ఐదు వికెట్లతో చెలరేగాడు.
టీమిండియా మ్యాచ్ గెలిచిన తర్వాత బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) ఆధ్వర్యంలో సుమారు ఐదు నిమిషాల పాటు భారీ బాణసంచా కాల్చారు. స్టేడియానికి సమీపాన ఉన్న ప్లాసే రోడ్డులో ఉన్న గుర్రం.. ఫైర్ క్రాకర్స్ సౌండ్ విని భయంతో పరుగు లంకించింది. అదే సమయంలో రోడ్డు మీద రెండు మూడు వాహానాలను ఢీకొని మరణించినట్టు కోల్కతా పోలీసులు తెలిపారు.