వ్యక్తిగత ఆర్థిక ప్రణాళికలో ఎక్కువగా నిర్లక్ష్యం చేసేది రిటైర్మెంట్ ప్రణాళికనే. చాలామంది రిటైర్మెంట్ దగ్గర పడినప్పుడే దాని గురించి ఆలోచించడం మొదలుపెడతారు. అయితే ముందస్తుగా వేసుకునే పక్కా ప్లాన్తోనే చీకూ చింతా లేని రిటైర్మెంట్ జీవితాన్ని గడపవచ్చు. దీని కోసం ఏం చేయాలో చూద్దాం..
పొదుపు: పొదుపు ఎంత త్వరగా మొదలుపెడితే అంత లాభం. పవర్ కాంపౌండింగ్తో తొలినాళ్లలో చేసిన పొదుపు విలువ రిటైర్మెంట్ నాటికి ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుంది. ఇలాంటి రిటైర్మెంట్ స్కీములను ఇన్సూరెన్స్ కంపెనీలు చాలానే ఆఫర్ చేస్తున్నాయి. వీటిలో లైఫ్ కవరేజీ కూడా ఉండడం అదనపు ఆకర్షణ. 60 ఏండ్లు వచ్చే నాటికి కోటి రూపాయల కార్పస్ ఫండ్ కావాలనుకుంటే 30 ఏండ్ల వ్యక్తి ఏటా లక్ష పొదుపు చేస్తే చాలు. అదే 40 ఏండ్ల వ్యక్తి నెలనెలా రూ.2 లక్షలను పొదుపు చేయాల్సి ఉంటుంది.
ఆదాయం: రిటైర్మెంట్ సమయంలో నెలనెలా గ్యారంటీగా వచ్చే ఆదాయం చాలా ముఖ్యం. అందుకు తగ్గట్టుగా యాన్యుటీ ఆర్థిక సాధనాలు చాలానే ఉన్నాయి. సింగిల్ ప్రీమియం చెల్లింపుతో జీవితాంతం రెగ్యులర్ ఆదాయాన్ని పొందవచ్చు. యాన్యుటి ప్రొడక్ట్స్ రెండు రకాలు. మొదటిది రిటైర్మెంట్ దగ్గర పడినవారు వెంటనే నెలసరి ఆదాయం మొదలయ్యే సాధానాన్ని ఎంచుకోవచ్చు. రెండోది డిఫర్డ్ యాన్యుటీ ప్లాన్. ఇందులో గరిష్ఠంగా పదేండ్లపాటు వాయిదా వేసుకోవచ్చు. 50 ఏండ్లు వచ్చినప్పుడు దీన్ని ఎంచుకోవచ్చు. ఈ రెండింటిలోనూ రిటైర్మెంట్ తర్వాతనే ఆదాయం వచ్చే సదుపాయం ఉంటుంది. కొన్ని బీమా సంస్థలు గ్యారంటీతో పెన్షన్ ప్లాన్లను అందిస్తున్నాయి. అందులోని ఫీచర్లను పోల్చుకుని ఎంచుకోవచ్చు. సాధారణంగా నెలసరి ఆదాయంలో కనీసం 5 నుంచి 10 శాతం వరకు రిటైర్మెంట్ ప్రణాళికకు కేటాయించాలి.