టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీకి భారత సీనియర్ సెలక్షన్ కమిటీ షాక్ ఇవ్వబోతుందా..? పొట్టి ప్రపంచకప్ ముందున్న నేపథ్యంలో ఆడకున్నా కోహ్లీని ఇంకా జట్టులోకి నెట్టుకురావడం కష్టమని భావిస్తుందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. ఇంగ్లండ్ తో టీ20 సిరీస్ తో పాటు వన్డేలలో విరాట్ ఆటే అతడి భవిష్యత్ పై ఆధారపడి ఉంది. ఈ సిరీస్ లో కూడా కోహ్లి విఫలమైతే పేరు, ప్రతిష్ట, రికార్డులు అన్నీ పక్కకుబెట్టి టీ20లలో అతడికి నిర్మోహమాటంగా గుడ్ బై చెప్పేందుకు భారత సీనియర్ సెలక్షన్ కమిటీ సిద్ధమైంది.
తాజాగా ఇన్సైడ్ స్పోర్ట్స్ లో వచ్చిన కథనం మేరకు.. రాబోయే ఇంగ్లండ్ సిరీస్ కోహ్లి భవితవ్యానికి కీలకమని సమాచారం. ఇంగ్లండ్ తో రెండు టీ20లు, మూడు వన్డేలు ఆడే అవకాశమున్న కోహ్లి.. ఈ మ్యాచులలో రాణిస్తేనే అతడు టీ20 ప్రపంచకప్ జట్టుకు ఎంపికయ్యే అవకాశముందని, లేకుంటే వేటు తప్పదని సెలక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఈ రెండు సిరీస్ (ఐదు మ్యాచులు) లలో కోహ్లీ ఆటపై సెలక్టర్లు ప్రత్యేక దృష్టి సారించనున్నారని తెలుస్తున్నది.
ఇదే విషయమై బీసీసీఐకి చెందిన ఓ ప్రతినిధి మాట్లాడుతూ.. ‘భారత క్రికెట్ కు అతడు చాలా సేవ చేశాడు. ఎవరెన్ని చెప్పినా అతడు గొప్ప ఆటగాడు. అందులో సందేహమే లేదు. కానీ గత కొంతకాలంగా అతడి ఫామ్ ఆందోళనకరంగా ఉంది. సెలక్టర్లు ఆటగాళ్ల ఫామ్ ను బట్టి జట్టులోకి ఎంపిక చేస్తారే తప్ప పేరు, ప్రఖ్యాతులను చూసి కాదు. రాబోయే సిరీస్ లో కోహ్లీ ప్రదర్శనపై నిఘా ఉంది. అతడి పై ఇక సెలక్టర్లు కూడా ఆడతావా..? వెళ్తావా..? అన్న పరిస్థితుల్లోనే ఉన్నారు. ఒకవేళ కోహ్లీ ఇంగ్లండ్ తో సిరీస్ లలో రాణించకుంటే సెలక్టర్లు తప్పకుండా ఇతర ఆప్షన్లను పరీక్షించే పనిలో ఉన్నారు..’ అని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.
అక్టోబర్ లో ఆసీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో బీసీసీఐ ఇక పూర్తిస్థాయి జట్టును సిద్ధం చేయాలనే ఆలోచనతో ఉంది. ఆ లోపు భారత జట్టు మరో 15 టీ20లు ఆడాల్సి ఉంది. ఇక ప్రయోగాలతో కాలక్షేపం చేసే టైమ్ కూడా లేనందున ‘ఆడితేనే జట్టులో.. లేకుంటే ఇంటికే’ అన్న ఫార్ములా ను పాటిస్తున్నది. కోహ్లీకి ఎన్ని అవకాశాలిచ్చినా అతడు తన ఫామ్ ను అందుకోకపోవడం.. సెలక్టర్లు కూడా చూసీ చూడనట్టు వదిలేయడంతో ఇన్నాళ్లు గడిచింది గానీ ఇకపై అలాంటి పరిస్థితులు లేవని తెలుస్తున్నది.
కోహ్లీ ఇంగ్లండ్ తో సిరీస్ లలో రాణిస్తేనే త్వరలో రాబోయే వెస్టిండీస్ సిరీస్ లో జరిగే టీ20 సిరీస్ కు అందుబాటులో ఉంటాడు. లేకుంటే వన్డేల మాదిరిగానే టీ20 సిరీస్ లో కూడా కోహ్లికి ‘విశ్రాంతి’నిచ్చి ఇక సెలవు..! అని చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదని బీసీసీఐ వర్గాల సమాచారం.