హాంగ్జౌ : ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ల పతకాల వేటతో స్ఫూర్తి పొందిన పారా అథ్లెట్లు దుమ్మురేపుతున్నారు. హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఈ పోటీల్లో 82 పతకాలతో భారత క్రీడా యవనికపై కొత్త అధ్యాయం లిఖించారు. ఇప్పటి వరకూ 2018 ఇండోనేషియాలో గెలిచిన 72 (15 పసిడి, 24 వెండి, 33 కాంస్యం)పతకాలు అత్యధికం కాగా.. ఈసారి రికార్డు స్థాయిలో 82 పతకాలు గెలిచి దేశమంతా గర్వపడేలా చేశారు.
పోటీలు ప్రారంభమైన నాలుగు రోజుల్లోనే 18 పసిడి, 23 వెండి, 41 కాంస్య పతకాలు చేజిక్కించుకొని ఔరా అనిపించారు. గురువారం జరిగిన పురుషుల ఎఫ్ 46 షాట్పుట్ పోటీలో సచిన్ సర్జేరావు.. ఇనుప గుండును 16.03 మీటర్ల దూరం విసిరి స్వర్ణం కొల్లగొట్టాడు. పారా షూటర్ సిద్ధార్థ బాబు ఆర్ 6 మిక్స్డ్ 50 మీటర్ల పోటీలో పసిడి వెలుగులు విరజిమ్మాడు. ఆర్చరీ కాంపౌండ్ మిక్స్డ్ పోటీల్లో శీతల్ దేవి, రాకేశ్ కుమార్ జంట చైనా ద్వయాన్ని 151-149తో చిత్తు చేసి బంగారు పతకం దక్కించుకుంది. సిమ్రాన్ టీ12 100 మీటర్ల పరుగులో వెండి, భాగ్యశ్రీ మాధవ్రావు జాదవ్ షాట్పుట్లో రజతంతో మెరిశారు. నారాయణ్ ఠాకూర్ పురుషుల టీ37 100 మీటర్ల రేసులో కాంస్య పతకం గెలిచాడు.