T20 World Cup : ఐపీఎల్ పదిహేడో సీజన్ ఆద్యంతం ఉత్కంఠగా సాగుతోంది. ఈ ఎడిషన్లో ముంబై ఇండియన్స్ సారథిగా ఎంపికైన హార్దిక్ పాండ్యా(Hadhik Pandya) వరల్డ్ కప్లో కీలకం కానున్నాడు. అయితే.. మెగా టోర్నీలో పాండ్యా ప్రదర్శనపై బీసీసీఐ(BCCI)తో పాటు సెలెక్టర్లు ఓ కన్నేసి ఉంచారు. వరల్డ్ కప్ కెప్టెన్గా ఎంపికైన రోహిత్ శర్మ, హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్లు తుది స్క్వాడ్ ఎంపికపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు.
ఆ సమయంలో హార్దిక్ ఆల్రౌండర్గా రాణించడంపై ఈ ముగ్గురు ప్రధానంగా దృష్టి సారించారు. దాంతో, వరల్డ్ కప్ జట్టులోకి రావాలంటే.. పాండ్యా బ్యాటర్గానే కాకుండా బౌలర్గానూ రాణించాలనే ఏకాభిప్రాయానికి వచ్చారట. ఐపీఎల్లో పాండ్యా ఆరింటా కేవలం నాలుగు మ్యాచుల్లో బౌలింగ్ చేసి మూడంటే మూడే వికెట్లు తీశాడు. బ్యాటింగ్లోనూ నిరాశపరుస్తూ 131 రన్స్ కొట్టాడు.
హార్దిక్ పాండ్యా, శివం దూబే
మరోవైపు యువకెరటం శివం దూబే(Shivam Dube) శివతాండవం చేస్తున్నాడు. ఇంప్యాక్ట్ ప్లేయర్గా చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న దూబే 163.51 స్ట్రయిక్ రేటుతో 242 రన్స్ కొట్టాడు. స్పిన్ బౌలర్ కూడా అయిన దూబేను పాండ్యా బదులు టీ20 వరల్డ్ కప్లో తీసుకోవాలనే డిమాండ్లు రోజురోజుకు ఎక్కువైతున్నాయి. పదిహేడో సీజన్ ముగిసిన ఐదు రోజులకే టీ20 వరల్డ్ కప్ షురూ కానుంది. అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీ జూన్ 1న ప్రారంభం అవుతుంది.
టీమిండియా టీ20 సారథిగా నిరూపించుకున్న పాండ్యా.. భావి కెప్టెన్గా ప్రశంసలు అందుకున్నాడు. అయితే.. కెరీర్ గొప్పగా సాగుతున్న సమయంలోనే ఈ ఆల్రౌండర్ గాయపడ్డాడు. వన్డే వరల్డ్ కప్లో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో బౌలింగ్ చేస్తుండగా.. ఎడమ మోకాలు మడత పడడంతో డగౌట్కు వెళ్లాడు. ఈ మధ్యే కోలుకున్న పాండ్యా బరోడా స్టేడియంలో బ్యాటింగ్, బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు.
ఐపీఎల్ 17వ సీజన్ మినీ వేలానికి ముందు ట్రేడ్ పద్దతిలో గుజరాత్ నుంచి ముంబైకి మారిన పాండ్యా.. అనూహ్యంగా కెప్టెన్గా ఎంపికయ్యాడు. అతడి సారథ్యంలో హ్యాట్రిక్ ఓటముల తర్వాత ఖాతా తెరిచిన ముంబైకి వాంఖడేలో చెన్నై పెద్ద షాకిచ్చింది.