Sarfaraz Ahmed: వరుస ఓటములతో పాటు బోర్డు రాజకీయాలు, ఛైర్మన్ రాజీనామాతో సతమతమవుతున్న పాకిస్తాన్ క్రికెట్లో మరో కుదుపు. ఆ జట్టు మాజీ సారథి, ప్రస్తుతం టెస్టులలో వికెట్ కీపర్గా కొనసాగుతున్న సర్ఫరాజ్ అహ్మద్.. దేశాన్ని వీడనున్నట్టు పాకిస్తాన్ మీడియా కోడై కూస్తోంది. 2017లో తన సారథ్యంలోనే ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్తాన్కు అందించిన సర్ఫరాజ్.. ఇటీవల కాలంలో మహ్మద్ రిజ్వాన్తో పాటు ఇతర వికెట్ కీపర్ల నుంచి పోటీని తట్టుకోలేక జట్టులో ప్లేస్ కోసం నానా తంటాలు పడుతున్న విషయం తెలిసిందే. సర్ఫరాజ్ ఇటీవలే పాకిస్తాన్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టెస్టులలో ఆడాడు. వైట్ బాల్ క్రికెట్లో పాకిస్తాన్ తరఫున 2021లో ఆడాడు.
2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత ఫామ్ లేమితో పాటు మహ్మద్ రిజ్వాన్ మూడు ఫార్మాట్లలో వికెట్ కీపర్గా కొనసాగుతుండటంతో సెలక్టర్లు సర్ఫరాజ్ అహ్మద్ను పట్టించుకోలేదు. కానీ గతేడాది అతడు జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్లో అతడిని పట్టించుకోకపోయినా సర్ఫరాజ్.. టెస్టు క్రికెట్లో మాత్రం అడపాదడపా అవకాశాలు అందుకుంటున్నాడు. కానీ ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో పాక్ జట్టు అతడిని బ్యాకప్ వికెట్ కీపర్గా వాడుకుంది. దీంతో ఇక్కడ ఉంటే తాను జట్టుతో ఉంటూ విమానాల్లో తిరగడం తప్ప ఆడేదేమీ ఉండదని సర్ఫరాజ్ భావిస్తున్నాడట. అందుకే పాకిస్తాన్ నుంచి పూర్తిస్థాయిలో యూకేకు మకాం మార్చాలని, అక్కడే ఉంటూ కౌంటీలు, ఫ్రాంచైజీ క్రికెట్లో ఆడాలని కోరుకుంటున్నట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తున్నది.
Sarfaraz Ahmed has left Pakistan and migrated to London with his family due to concerns over his future with Pakistan Team. pic.twitter.com/xvutnH80pM
— Vipin Tiwari (@Vipintiwari952_) January 20, 2024
అయితే సర్ఫరాజ్ కోరుకున్నట్టు అతడికి ఫ్రాంచైజీ క్రికెట్లో అవకాశాలు దక్కుతాయా..? అనేది అనుమానమే. 36 ఏండ్ల వయసున్న సర్ఫరాజ్ను తీసుకోవడానికి ఏ ఫ్రాంచైజీ ముందుకొస్తుందనేది కూడా ప్రశ్నార్థకమే. తాను పాక్ వదిలి యూకేకు వెళ్లినా త్వరలో పాకిస్తాన్లో జరగాల్సి ఉన్న పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో మాత్రం ఆడతానని తాను ప్రాతినిథ్యం వహిస్తున్న క్వెట్టా గ్లాడియేటర్స్ మేనేజ్మెంట్కు తెలిపాడంట. మరి ఈ సీజన్ ముగిసిన తర్వాత సర్ఫరాజ్ పాక్ను వీడతాడా..? లేక ఇవన్నీ పుకార్లేనా..? అనేది తెలియాలంటే పీఎస్ఎల్ అయ్యేదాకా వేచి చూడాల్సిందే.