Pakistan Cricket Team: వన్డే వరల్డ్ కప్ – 2023లో వరుసగా నాలుగు మ్యాచ్లలో ఓడిన పాకిస్తాన్ సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప పాకిస్తాన్.. గ్రూప్ స్టేజ్ నుంచి ముందంజ వేయడం అసాధ్యం. దక్షిణాఫ్రికాతో తప్పక నెగ్గాల్సిన మ్యాచ్లో ఆఖరివరకూ పోరాడినా ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ సారథి రషీద్ లతీఫ్.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)పై సంచలన ఆరోపణలు చేశాడు. గడిచిన ఐదు నెలలుగా పీసీబీ.. ఆటగాళ్లకు జీతాలు ఇవ్వడం లేదని ఆరోపించాడు.
గత కొద్దిరోజులుగా పాకిస్తాన్ క్రికెటర్లకు, బోర్డుకు మధ్య సఖ్యత కొరవడిందని, జట్టులో కూడా విభేదాలు తారాస్థాయికి చేరాయని వార్తలు వస్తున్నాయి. బాబర్ను వరల్డ్ కప్ తర్వాత సారథిగా తప్పిస్తారని పాకిస్తాన్ మీడియా కోడై కూస్తోంది. తన పొజిషన్తో పాటు జట్టుకు మద్దతు గురించి మాట్లాడటానికి బాబర్.. పీసీబీ పెద్దలను సంప్రదిస్తున్నా వాళ్లు స్పందించడం లేదని తెలుస్తున్నది.
ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాతో మ్యాచ్ ముగిసిన తర్వాత ఓ టీవీ ఛానెల్లో లతీఫ్ మాట్లాడుతూ.. ‘పాకిస్తాన్ మీడియాలో చాలా విషయాలు చక్కర్లు కొడుతున్నాయి. బహుశా అవన్నీ ఫేక్ న్యూస్. నేను మీకు అసలైన నిజాలు చెబుతున్నా. గత రెండ్రోజుల నుంచి బాబర్ ఆజమ్.. పీసీబీ చీఫ్తో పాటు సీవోవోను కాంటాక్ట్ అవుతున్నాడు. కానీ వాళ్లు అతడికి అపాయింట్మెంట్ ఇవ్వడంలేదు. పాకిస్తాన్ ప్లేయర్లకు గడిచిన ఐదు నెలలుగా జీతాలు చెల్లించడం లేదు. వరల్డ్ కప్కు ముందు ఆటగాళ్ల కాంట్రాక్టులను పునఃపరిశీలిస్తామని పీసీబీ చెప్పింది. కానీ ఇంతవరకూ అది ఓ కొలిక్కి రాలేదు. జీతాలు లేకుండా వాళ్లు ఎలా ఆడతారు..?’ అని ఆరోపించాడు.