Waqar Younis | పెద్ద మ్యాచ్ల్లో టీమ్ ఇండియాను ఓడించే సత్తా పాకిస్థాన్ జట్టుకు లేదని ఆ దేశ మాజీ కెప్టెన్ వకార్ యూనిస్ పేర్కొన్నాడు. అక్టోబర్ 5 నుంచి వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుండగా.. 14న అహ్మదాబాద్ లో స్టేడియంలో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్పై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో.. వాకార్ యూనిస్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇప్పటి వరకు వన్డే ప్రపంచకప్లో భారత్, పాకిస్థాన్ మధ్య ఏడు మ్యాచ్లు జరగ్గా.. ఏడింట్లోనూ టీమ్ఇండియానే విజయం సాధించింది. ఈ సారి కూడా అందుకు భిన్నమైన ఫలితం రాకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ నేపథ్యంలో వకార్ మాట్లాడుతూ.. ‘ప్రపంచకప్లో భారత్-పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్ చాలా పెద్దది. ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాల అభిమానులే కాకుండా.. యావత్ క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. వరల్డ్ కప్ మొత్తంలో అతి పెద్ద మ్యాచ్ ఇదే అని నా అభిప్రాయం. అహ్మదాబాద్ వేదికగా జరిగే ఆ మ్యాచ్లో పాకిస్థాన్ చాలా జాగ్రత్తగా ఆడాలి. భారత్తో పోల్చుకుంటే పాకిస్థాన్ బలహీనమైన జట్టు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఆచి తూచి ఆడితేనే పాక్ కు గెలిచే అవకాశాలున్నాయి’ అని పేర్కొన్నాడు. అయితే స్వదేశంలో భారీ అభిమాన సందోహం మధ్య బరిలోకి దిగనున్న భారత్ పై కూడా తీవ్ర ఒత్తడి ఉంటుందని వకార్ వ్యాఖ్యానించాడు.
‘బలాబలాల పరంగా టీమ్ఇండియా మెరుగ్గా ఉన్నా.. ఒత్తడిని అధిగిమించడం ముఖ్యం. లక్ష మందికి పైగా అభిమానుల సమక్షంలో మెరుగైన ప్రదర్శన చేయడమంటే ఆషామాషీ కాదు. అభిమానుల అరుపులు, కేకలు ఆటగాళ్లను ఒత్తిడికి గురి చేస్తాయి’ అని వకార్ అన్నాడు. ఇక మెగాటోర్నీ ప్రారంభానికి ముందే యువ పేసర్ నసీమ్ షా దూరం కావడం పాక్ కు ఎదురుదెబ్బ అని వకార్ అభిప్రాయపడ్డాడు. అతడు ఉంటే షాహీన్ షా అఫ్రిదితో కలిసి జట్టుకు మెరుగైన ఆరంభాలు ఇచ్చే అవకాశం ఉండేదని అన్నాడు. హసన్ అలీకి అపార అనుభవం ఉన్నా.. అతడు ప్రస్తుతం ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి అని పేర్కొన్నాడు.