Inzamam | గతేడాది భారత్లో జరిగిన ప్రపంచకప్లో పాక్ జట్టు పేలవ ప్రదర్శనకు బోర్డు మాజీ చైర్మన్ జాక అష్రఫ్ కారణమని సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్, మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ మండిపడ్డారు. జట్టులో అష్రఫ్ ప్రతికూల వాతావరణాన్ని సృష్టించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కీలకమైన ప్రపంచకప్ జరిగే సమయంలో సమయంలో జాతీయ జట్టును ఎంపిక చేసింది పాక్ బోర్డు కాదని, కెప్టెన్, చీఫ్ సెలక్టర్ మాత్రమే సెలక్ట్ చేశారని జకా అష్రఫ్ ప్రకటించాడని.. ఇది ఆటగాళ్లలో ప్రతికూల ఆలోచన తీసుకువస్తుందని.. ప్రదర్శనపై ప్రభావం చూపుతుందని ఇంజమామ్ పేర్కొన్నాడు.
అయితే, ప్రపంచకప్ సమయంలో ఇంజమామ్ చీఫ్ సెలెక్టర్ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పరస్పర విరుద్ధ ప్రయోజనాల ఆరోపణలు రావడంతో రాజీనామా చేశారు. ప్లేయర్స్ మేనేజ్మెంట్ కోసం రిజిస్టర్ అయిన యూకే కంపెనీలో ఇంజమామ్కు వాటాలున్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణకు బోర్డు కమిటీ వేసింది. కమిటీ నివేదిక కోసం ఆసక్తిగా చూస్తున్నట్లు ఇంజమామ్ తెలిపాడు. పీసీబీ, పాకిస్తాన్ క్రికెట్ను ఇకపై తాత్కాలిక ప్రాతిపదికన నడపరాదని ఇంజమామ్ సూచించారు. మార్పులు జట్టు ప్రదర్శనను ప్రభావితం చేశాయని, బాబర్ అజామ్ వంటి ప్రపంచ స్థాయి ఆటగాడిపై ఒత్తిడి తెచ్చినప్పుడు.. ఇతర ఆటగాళ్లు ఏం ఆలోచిస్తారో ఊహించాలన్నారు.
ప్రపంచకప్లో జట్టు పోరాడుతున్నందున వారికి ఆత్మవిశ్వాసం కల్పించాల్సిన అవసరం ఉందని.. కానీ అది జరిగలేదని మాజీ కెప్టెన్ తెలిపాడు. ప్రపంచ కప్ నుంచి పాకిస్తాన్ నిష్క్రమించిన కొద్ది గంటలకే, కెప్టెన్ బాబర్, ప్రధాన కోచ్ మిక్కీ ఆర్థర్లను పీసీబీ వేగంగా తొలగించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఏం చేయాలనుకుంటుందో పీసీబీ నిర్ణయించుకుందా? అని ప్రశ్నించారు. పాక్ జట్టులో మంచి ఆటగాళ్లు ఉన్నారని.. వారిలో ఆత్మ విశ్వాసం కల్పించాలని ఇంజమామ్ పేర్కొన్నారు. ఇంజమామ్ వ్యాఖ్యలపై పీసీబీ సీనియర్ అధికారి ఒకరు స్పందించారు. జకా అసభ్య ప్రవర్తన బోర్డుకు హానికరమన్నారు. జకా షరీఫ్ వన్ మ్యాష్ షోగా నడిపారని.. దాంతో పాక్ క్రికెట్కు భారీ నష్టం వాటిల్లిందన్నారు.