శ్రీలంక పర్యటనలో ఉన్న పాకిస్తాన్ ఉత్కంఠభరితంగా సాగిన తొలి టెస్టులో అద్భుత విజయం అందుకుంది. చివరి రోజు లంక బౌలర్ల కట్టడి తో పాటు వర్షం అంతరాయం వల్ల ఈ మ్యాచ్ లో ఫలితం ఏదైనా తేడా అవుతుందా..? అనే అనుమానాలను పటాపంచలు చేస్తూ పాకిస్తాన్ ఓపెనర్ అబ్దుల్లా షఫీఖ్ (408 బంతుల్లో 160 నాటౌట్, 7 ఫోర్లు, 1 సిక్సర్) ఆ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
గాలే వేదికగా ముగిసిన తొలి టెస్టులో 342 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా ఓవర్ నైట్ స్కోరు 222-3 తో ఐదో రోజు ఆట ఆరంభించిన పాక్ కు లంక బౌలర్లు షాకిచ్చారు. మహ్మద్ రిజ్వాన్ (40) ను జయసూర్య ఔట్ చేశాడు. ఆ తర్వాత అఘ సల్మాన్ (12), హసన్ అలీ (5) వికెట్లను వెంటవెంటనే కోల్పోవడంతో లంక శిబిరంలో ఆశలు రేగాయి.
కానీ సెంచరీ హీరో అబ్దుల్లా షఫీఖ్ లంకకు ఏమాత్రం అవకాశమివ్వలేదు. స్పిన్ ను అనుకూలిస్తున్న పిచ్ పై ఒత్తిడికి లోనుకాకుండా పని కానిచ్చేశాడు. 30 పరుగుల తేడాతో 3 వికెట్లు కోల్పోవడం.. వర్షం అంతరాయం కలిగించడంతో ఈ మ్యాచ్ లో పాక్ విజయంపై నెలకొన్న అనుమానాలకు చెక్ పెడుతూ అద్భుత ఆటతీరుతో పాక్ కు విజయాన్ని అందించాడు.
ఈ విజయంతో రెండు మ్యాచుల సిరీస్ లో పాకిస్తాన్ 1-0 ఆధిక్యం సాధించింది. ఈ సిరీస్ లో రెండో టెస్టు కూడా ఇదే వేదికపై జులై 24 నుంచి ప్రారంభమవుతుంది.
స్కోరు వివరాలు : శ్రీలంక తొలి ఇన్నింగ్స్ : 222, రెండో ఇన్నింగ్స్ : 337
పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్ : 218, రెండో ఇన్నింగ్స్ : 344-6