కొలంబో: ఆసియాకప్(Asia Cup)లో గ్రూప్ ఫోర్ దశలో పాకిస్థాన్, శ్రీలంక మధ్య మ్యాచ్ కేక పుట్టించింది. థ్రిల్లింగ్గా సాగిన ఆ మ్యాచ్లో రెండు జట్లు ఒకే స్కోర్ చేశాయి. కానీ చివరకు శ్రీలంకను విజయం వరించింది. డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఆ విక్టరీని నమోదు చేశారు. అసలు ఆ లెక్కను ఎలా చేశారో తెలుసుకుందాం.
వర్షం వల్ల తొలుత మ్యాచ్ను 45 ఓవర్లు నిర్వహించాలనుకున్నారు. అయితే ముందుగా పాకిస్థాన్ బ్యాటింగ్ చేసింది. ఓ దశలో మళ్లీ వర్షం రావడంతో.. ఆ మ్యాచ్ను 42 ఓవర్లకు కుదించారు. పాక్ ఏడు వికెట్లు కోల్పోయి 252 రన్స్ చేసింది. ఇక 252 టార్గెట్తో బరిలోకి దిగిన శ్రీలంక చివరి బంతికి ఆ స్కోర్ను అందుకున్నది. రెండు జట్లూ 252 రన్స్ చేసినప్పుడు ఎలా శ్రీలంక విజేతగా ప్రకటించారన్న విషయం క్రికెట్ అభిమానుల్ని కన్ఫ్యూజ్ చేస్తోంది.
పాక్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో.. 27.4 ఓవర్ల వద్ద వర్షం పడింది. ఆ సమయంలో పాక్ 5 వికెట్లు కోల్పోయి 130 రన్స్ చేసింది. రెండోసారి వర్షం రావడం వల్ల మ్యాచ్ను 42 ఓవర్లకు కుదించారు. అయితే పాకిస్థాన్ 252 రన్స్ చేసినా.. శ్రీలంకకు టార్గెట్ను మాత్రం 252 రన్స్కు ఇచ్చారు. ఇది ఎలాగంటే.. డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం పాకిస్థాన్ స్కోర్ చేసిన 252 రన్స్ నుంచి ఒక్క పరుగును తీసివేశారు. ఇలా ఎందుకు చేశారంటే,రెండో సారి వర్షం రావడానికి ముందే పాకిస్థాన్ అయిదు వికెట్లు కోల్పోయింది. దీంతో టార్గెట్లో ఒక్క పరుగు డిడెక్ట్ చేశారు. అప్పుడు పాకిస్థాన్ 251 స్కోర్ చేసినట్టు అవుతుంది. దీంతో లంక టార్గెట్ 252 అవుతుంది.
ఒకవేళ పాకిస్థాన్ జట్టు వర్షం రావడానికి ముందు నవాజ్ వికెట్ను కోల్పోకపోతే, అప్పుడు శ్రీలంక టార్గెట్ 252కు బదులుగా 255 ఉండేది. కానీ డక్వర్త్ లూయిస్ లెక్కల ప్రకారం వికెట్లే కీలకం. వికెట్లను కోల్పోకుండా ఉంటే అప్పుడు ప్రత్యర్థి జట్టుకు భారీ టార్గెట్ను ఇస్తారు. వర్షం వల్ల కుదించిన ఓవర్లకు ఆడే మ్యాచ్ల్లో ఒకవేళ మొదట బ్యాటింగ్ చేసిన జట్టు త్వరగా వికెట్లు కోల్పోయి, ఆ తర్వాత భారీ స్కోర్ చేసినా.. పెద్దగా ప్రయోజనం ఉండదు. మొదట్లో త్వరత్వరగా పాక్ వికెట్లను తీసిన శ్రీలంక.. ఆ తర్వాత లక్ష్య చేధనలో తక్కువ టార్గెట్ను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆల్రౌండర్ అసలంక అద్భుతమైన ఇన్నింగ్స్తో శ్రీలంకకు అపూర్వ విజయాన్ని అందించాడు.