హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ సెయిలింగ్ వీక్ అట్టహాసంగా ముగిసింది. ఈఎమ్ఈ సెయిలింగ్ అసోసియేషన్, సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్, భారత లేజర్ క్లాస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన టోర్నీలో సెయిలర్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. మహిళల లేజర్ రేడియల్ కేటిగిరీలో యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్(వైసీహెచ్) సెయిలర్ వీరవంశం వైష్ణవి(వైసీహెచ్) పసిడి పతకంతో పాటు ‘ఏఏ బాసిత్’ ట్రోఫీ విజేతగా నిలిచింది. దీంతో పాటు ఎస్ఎస్సీ లేజర్ రేడియల్ రోలింగ్లోనూ వైష్ణవి ఓవరాల్ విజేతగా నిలిచి ఔరా అనిపించింది.
మరోవైపు బాలికల లేజర్ 4.7 విభాగంలో రితికా దంగీ(ఎన్ఎస్ఎస్) స్వర్ణ పతకం సహా రూ.10వేల నజరానా దక్కించుకుంది. బాలుర విభాగంలో చున్ను కుమార్(టీఎస్సీ)కు పసిడి లభించింది. పురుషుల విభాగంలో సికాంశు సింగ్(టీఎస్సీ) స్వర్ణాన్ని ఖాతాలో వేసుకోగా, లేజర్ స్టాండర్డ్లో మోహిత్ సైనీ(ఏవైఎన్) పసిడితో మెరిశాడు. బహుమతి ప్రదాన కార్యక్రమానికి చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ అడ్మిరల్ కరమ్బీర్సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘టోర్నీలో విజేతలకు అభినందనలు. జాతీయ సెయిలింగ్ టోర్నీ ద్వారా అద్భుత ప్రతిభ కల్గిన సెయిలర్లు వెలుగులోకి వస్తున్నారు’ అని అన్నారు.