Wrestlers strike | రైతులపైకి వాహనాన్ని ఎక్కించి చంపితే కేంద్రమంత్రిని తొలగించలేదు బీజేపీ ప్రభుత్వం. క్రీడాకారిణులను లైంగికంగా వేధించిన బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్పై ఈగ పడనీయలేదు. సుప్రీంకోర్టు తలంటేవరకు ఆయనపై కేసు కూడా నమోదు చేయలేదు. ఇదేనా బీజేపీ చెప్పే ‘బేటీ బచావో..’? ఇదేనా ఆడబిడ్డలకు మోదీ చేసే న్యాయం? దేశం ఇప్పుడు ఇవే ప్రశ్నలు సంధిస్తున్నది. అంతర్జాతీయ వేదికలపై భారత కీర్తిపతాకను ఎగురవేసిన క్రీడాకారిణులు.. ఢిల్లీ నడిరోడ్డుపై ఆందోళన చేస్తున్నా.. మోదీ సర్కారు స్పందించని తీరు వివాదాస్పదమవుతున్నది.
అంతర్జాతీయ యవనికపై మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిన మన మల్లయోధులు.. సొంతగూట్లో సమస్యలతో సతమతమవుతున్నారు! దేశ విదేశాల రెజ్లర్లను ఎత్తి కుదేసిన మన భీమసేనులు.. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో నడిరోడ్డుపై ప్రాక్టీస్ కొనసాగిస్తున్నారు!! లెక్కకు మిక్కిలి పతకాలతో క్రీడా జగత్తును తమవైపు తిప్పుకున్న స్టార్ రెజ్లర్లు.. ఇప్పుడు ఇతర క్రీడా ప్రముఖుల మద్దతు కోరుతున్నారు!!!
జాతీయ రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ తమను వేధించాడని రోడ్డెక్కిన రెజ్లర్లు.. అతడిపై కఠిన చర్యలు తీసుకునేంత వరకు విశ్రమించేది లేదని ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద భీష్మించి కూర్చున్నారు. మద్దతు తెలుపాల్సిన భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) అధ్యక్షురాలు పీటీ ఉష రెజ్లర్లపై కక్ష కట్టినట్లు మాట్లాడుతుంటే.. పతకాలు సాధించినప్పుడు అభినందించడంలో ముందుండే క్రికెటర్లు నిమ్మకు నీరెత్తినట్లు ఉండటంపై కుస్తీ వీరులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.
విశ్వక్రీడ సంబురం ఒలింపిక్స్లో భారత్కు అత్యధిక వ్యక్తిగత పతకాలు అందించిన మల్లయోధులు.. జాతీయ రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్పై తమ పోరాటం కొనసాగిస్తున్నారు. సమాఖ్య అధ్యక్షుడిపై తీవ్ర ఆరోపణలు వచ్చినా.. కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన రెజ్లర్లు.. ఇతర క్రీడాకారులు ఈ అంశంపై నోరు మెదపకపోవడంపై గుర్రుగా ఉన్నారు. విశ్వ వేదికలపై పతకాలు సాధించిన వెంటనే ఆకాశానికెత్తుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్లు పెట్టే క్రికెటర్లు.. రెజ్లర్ల పోరాటంపై నోరు మెదపకపోవడం ఆశ్చర్యం కలిగిస్తున్నదని అంటున్నారు. అక్కడెక్కడో అగ్రరాజ్యం అమెరికాలో జరిగిన జాత్యహంకార హత్యపై మూకుమ్మడిగా స్పందించిన క్రీడాలోకం.. ఇప్పుడు గళమెత్తకపోవడం తమను మరింత బాధిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కాగా.. ఒలింపిక్ స్వర్ణ పతక విజేత, స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా సహా పలువురు క్రీడాకారులు రెజ్లర్లకు మద్దతుగా నిలిచారు. ‘న్యాయం కోరుతూ మన క్రీడాకారులు వీధుల్లోకి రావడం ఎంతగానో బాధిస్తున్నది. మన దేశానికి ప్రాతినిధ్యం వహించడానికి ప్రపంచ వేదికపై మనల్ని గర్వపడేలా చేసేందుకు వారు ఎంతో శ్రమించారు’అని నీరజ్ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. సత్వర న్యాయం చేస్తామన్న కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తమ సమస్యను వినేందుకు కూడా ఆసక్తి చూపడం లేదని స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియా ఆరోపించాడు.
రెజ్లర్ల మెదడు మోకాళ్లలో ఉంటుందని కొందరు అంటుంటారు. కానీ మా మనసు, మెదడు ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాయి. ఇతర క్రీడాకారులే ఒకసారి సరిచూసుకోవాలి. అసలు వారి దగ్గర స్పందించే హృదాయాలు ఉన్నాయో లేవో.
-సాక్షి మాలిక్
ఈ దేశమంతా క్రికెట్ను ఆరాధిస్తుంది. కానీ, ఒక్క క్రికెటర్ కూడా మా ఆందోళనపై స్పందించలేదు. మాకు అనుకూలంగా మాట్లాడమని మేం ఆడగడం లేదు. న్యాయం కోసం స్పందించమంటున్నాం. ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ ఉద్యమానికి క్రికెటర్లు మద్దతు పలికారు. ఆ మాత్రం మద్దతుకు మేం అర్హులం కాదా. వారెందుకు భయపడుతున్నారో మాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు మీ మద్దతు పొందడానికి అర్హులం కాకపోతే.. మాకు పతకాలు వచ్చినప్పుడు అభినందిస్తూ పోస్ట్లు పెట్టకండి.
– వినేశ్ ఫొగాట్