టోక్యో: భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియా టోక్యో విశ్వక్రీడల్లో సత్తాచాటాడు. సెమీస్లో ఓటమితో స్వర్ణ పతక కల చెదిరినా.. తన తొలి ఒలింపిక్స్లోనే ఈ హర్యానా యోధుడు కాంస్యంతో మెరిశాడు. శనివారం ఇక్కడ జరిగిన పురుషుల 65కేజీల కాంస్య పతక పోరులో ప్రపంచ రెండో ర్యాంకర్ బజరంగ్ 8-0 తేడాతో దౌలత్ నియజ్బెకోవ్ (కజకిస్థాన్)పై ఏకపక్షంగా విజయం సాధించాడు. ఆది నుంచి దూకుడు ప్రదర్శించిన 27 ఏండ్ల బజరంగ్.. భళా అనిపించాడు. ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ఉడుం పట్టుతో పాయింట్లు పట్టేశాడు. మోకాలి గాయం కాస్త ఇబ్బంది పెట్టినా బజరంగ్ ఎక్కడా తగ్గలేదు. కాగా ఒకే ఒలింపిక్స్లో భారత రెజ్లర్లు రెండు పతకాలు సాధించడం ఇది రెండోసారి. టోక్యోలో రవి దహియా(57 కేజీలు) రజతం సాధించగా.. ఇప్పడు బజరంగ్ కాంస్యం పట్టాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న మహిళా స్టార్ వినేశ్ ఫోగట్ క్వార్టర్స్లో ఓడడం నిరాశ కలిగించింది. మొత్తంగా ఏడుగురు భారత రెజ్లర్లు టోక్యోకు వెళ్లగా.. రెండు పతకాలు వచ్చాయి.
దూకుడు కొనసాగిస్తూ..
గత మూడేండ్లుగా బజరంగ్ పునియా అద్భుత ప్రదర్శనలు చేస్తూనే ఉన్నాడు. 2018 కామన్వెల్త్ క్రీడలు, ఆసియా గేమ్స్లో స్వర్ణాలు సహా ప్రపంచ చాంపియన్షిప్ టోర్నీల్లో పతకాలు కొల్లగొట్టాడు. బరిలోకి దిగిన ప్రతీ టోర్నీలో సత్తాచాటాడు. దీంతో ఒలింపిక్స్లో బజరంగ్ స్వర్ణంతో చరిత్ర సృష్టిస్తాడని అంచనాలు పెరిగాయి. అంచనాల ఒత్తిడో.. మెకాలి గాయం ఇబ్బంది పెట్టడమో.. తన రోజు కాకపోవడమో కానీ సెమీస్లో హజి ఎలెవ్ చేతిలో బజరంగ్ ఓడిపోయాడు. అయితే దెబ్బతిన్న సింహంలా గర్జించి కాంస్యం పట్టాడు. ఒలింపిక్స్లో పతకం సాధించిన ఐదో భారత రెజ్లర్గా నిలిచాడు.
నేను పూర్తి సంతోషంగా లేను. నేను నిర్దేశించుకున్న లక్ష్యం ఇది కాదు. ఒలింపిక్స్లో కాంస్యం సాధించడం తక్కువేం కాదు. కానీ మరీ సంబుర పడడం లేదు.