హైదరాబాద్, ఆట ప్రతినిధి : తెలంగాణ నుంచి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తీర్చిదిద్దుతామని, ఒలింపిక్స్లో పతకాలు సాధించేలా రూపుదిద్దుతామని ప్రభుత్వం మైకుల ముందు ఊదరగొడుతోంది. కానీ ఆచరణలో మాత్రం పేద, మధ్యతరగతి వర్గాల చిన్నారుల క్రీడా ఆశయాలకు మొగ్గ దశలోనే అడ్డంకులు సృష్టిస్తోంది. హైదరాబాద్లోని తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్) పరిధిలోని స్టేడియాలు, క్రీడా ప్రాంగణాల్లో శిక్షణ పొందే చిన్నారి క్రీడాకారులపై ప్రభుత్వం ఫీజుల పిడుగు వేసింది. కోచింగ్ ఫీజులు, స్టేడియం అద్దెలను భారీస్థాయిలో పెంచింది. మొన్నటిదాకా నామమాత్రపు ఫీజులు మాత్రమే చెల్లించిన క్రీడాకారుల తల్లిదండ్రులు ఇప్పుడు ఏకంగా 5 నుంచి 10 రెట్లు పెరిగిన రుసుములను చూసి షాకవుతున్నారు.
గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఎల్బీ, సరూర్ నగర్, యూసుఫ్గూడ స్టేడియాలు, జింఖానా మైదానం, ఓయూలోని సైక్లింగ్ వెలోడ్రోమ్లో ఇది వరకు మెజారిటీ ఆటలకు ఉచితంగా కోచింగ్ ఇవ్వగా.. ఇప్పుడు క్రీడా ప్రాంగణాలు, ఆటలను కేటగిరీలుగా విభజించి మరీ ప్రతీ దానికి రేటు ఫిక్స్ చేశారు. షూటింగ్ కోచింగ్కు గతంలో వెయ్యిగా ఉన్న ఫీజును రూ. 4500కు పెంచారు. 300 నుంచి 600గా ఉన్న స్మిమ్మింగ్ ఫీజును 4500 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. స్కాష్కు ఉచితంగా ఇచ్చిన కోచింగ్ను ఇప్పుడు 3 వేలు చేశారు. క్రీడా శాఖ నుంచి జులైలోనే ఫీజుల పెంపు జీవో విడుదలవ్వగా.. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్నందుకు బహుమతిగా అన్నట్టు ఈనెల ఆరంభం నుంచి కొత్త ఫీజులను వసూలు చేస్తున్నారు.
కార్పొరేట్, ప్రైవేటు అకాడమీలు వసూలు చేసే రుసుములకు ఏమాత్రం తగ్గకుండా సర్కారు మైదానాల్లో ఫీజులు నిర్ణయించారు. అయితే ఫీజులు ప్రైవేటు స్థాయిలో గుంజుతున్న అధికారులు, అక్కడ సదుపాయాలు కల్పించడంలో మాత్రం ఘోరంగా విఫలమయ్యారు. పలు స్టేడియాల్లో తాగునీరు, శుభ్రమైన వాష్రూమ్లు, కనీస క్రీడా పరికరాలు అందుబాటులో లేవు. చాలా చోట్ల శాశ్వత కోచ్లు లేక ఔట్ సోర్సింగ్ సిబ్బందితోనే నెట్టుకొస్తున్నారు.
రాష్ట్ర, జిల్లా క్రీడా సంఘాలు, అకాడమీలు టోర్నమెంట్లు, స్టేట్ ర్యాంకింగ్ పోటీలు నిర్వహించుకోవడానికి స్టేడియాల అద్దెలను ఊహించని రీతిలో పెంచేశారు. గచ్చిబౌలి మెయిన్ స్టేడియం రోజువారీ అద్దెను రూ. 15 వేల నుంచి ఏకంగా 2 నుంచి 4 లక్షల వరకు పెంచడంతో స్థానిక క్రీడా సంఘాలు టోర్నీలు నిర్వహించలేక చేతులెత్తేస్తున్నాయి. మరోవైపు సినిమా, సంగీత వేడుకలు, ప్రైవేటు వ్యాపార ఎగ్జిబిషన్లకు రోజుకు రూ. 5 లక్షల నుంచి రూ. 16 లక్షల వరకు అద్దె నిర్ణయించారు. క్రీడా సంఘాలకు అద్దెలు భారం చేసి పోటీలు జరగకుండా నిరుత్సాహపరిస్తే ఆ స్థానంలో ఎంత రేటైనా ఇచ్చే ప్రైవేటు ఈవెంట్లకు మైదానాలు కేటాయించాలని చూస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాల వెనుక ఉన్న అసలు ఉద్దేశం క్రీడా ప్రాంగణాలను పేదలకు దూరం చేసి, వాటిని కార్పొరేట్, ప్రైవేటు వ్యక్తుల పరం చేయడమని క్రీడా ప్రేమికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మా ఇద్దరు అబ్బాయిలు ఎల్బీ స్టేడియంలో కరాటే శిక్షణ తీసుకుంటున్నారు. ఇప్పటిదాకా ఒక్కొక్కరికి రూ. 150 రుసుము ఉండేది. ఇప్పుడు దాన్ని రూ. 960 చేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా, కమిటీ ఏర్పాటు చేయకుండా, కనీసం నోటీసుల బోర్డులో పెట్టకుండా ఫీజులను పెంచేశారు. ఇదేంటని ప్రశ్నిస్తే.. స్టేడియాల మెయింటెనెన్స్ కోసమని శాట్ ఎండీ చెబుతున్నారు. స్టేడియాల నిర్వహణ బాధ్యత ప్రభుత్వానిదా? క్రీడాకారులదా?. పెంచిన ఫీజులు తగ్గించాలని క్రీడా శాఖ మంత్రిని కోరాం. తగ్గించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. –
పేద, మధ్య తరగతి క్రీడాకారులు శిక్షణ తీసుకునే ప్రభుత్వ ప్రాంగణాల్లో ఫీజులు, స్టేడియాలు అద్దెలు ఇంత భారీ స్థాయిలో పెంచడం దారుణం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామీణ క్రీడాకారులను సైతం ప్రోత్సహించే విధంగా 90 నియోజకవర్గాల్లో స్టేడియాల నిర్మాణం ప్రారంభించి స్విమ్మింగ్ పూల్స్ వంటి సౌకర్యాలు కల్పించింది. ప్రతీ గ్రామంలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసింది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడల ద్వారా కాసులు దండుకోవాలని చూస్తోంది. పైకి ఒలింపిక్ కథలు చెబుతూ.. పేద క్రీడాకారులను మైదానాలకు దూరం చేసే ప్రయత్నాలు చేస్తోంది. నగరంలోని విలువైన ప్రాంతాల్లో ఉన్న స్టేడియాలను ప్రైవేటు పరం చేసే కుట్ర కనిపిస్తోంది.
-శాట్ మాజీ చైర్మన్ ఆంజనేయ గౌడ్
