లుసానే: ఒలింపిక్ చాంపియన్ నీరజ్ చోప్రా.. వరుసగా రెండో ఏడాది డైమండ్ లీగ్ టైటిల్ చేజిక్కించుకున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి దాటాక జరిగిన ప్రతిష్ఠాత్మక లీగ్లో నీరజ్ బరిసెను 87.66 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానంలో నిలిచాడు. గాయం కారణంగా నెల రోజులుగా ఏ టోర్నీలోనూ పాల్గొనని నీరజ్.. ఐదో ప్రయత్నంలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. నాలుగో రౌండ్ వరకు రెండో స్థానంలో ఉన్న ఈ 25 ఏండ్ల భారత స్టార్.. ఐదో రౌండ్లో బరిసెను అల్లంత దూరం విసిరాడు.
జూలియన్ వెబర్ (87.03 మీటర్లు, జర్మనీ), జాకబ్ వాడ్లిచ్ (86.13 మీ.; చెక్ రిపబ్లిక్) వరుసగా రజత, కాంస్యాలు దక్కించుకున్నారు. ‘గాయం నుంచి కొలుకొని తిరిగి సత్తాచాటడం ఆనందంగా ఉంది. నా అత్యుత్తమ ప్రదర్శనను పునరావృతం చేయలేకపోయా. అయినా దీంతో సంతృప్తిగానే ఉన్నా’ అని నీరజ్ అన్నాడు. కాగా.. వచ్చే నెలలో బుడాపెస్ట్ వేదికగా జరుగున్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ వరకు మరే టోర్నీలో బరిలోకి దిగనని అతడు వెల్లడించాడు. గాయాల బెడద కారణంగా ప్రధాన టోర్నీల్లో మాత్రమే బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు.