భువనేశ్వర్: ఈ ఏడాది చివరిలో ఆతిథ్యం ఇవ్వనున్న పురుషుల హాకీ జూనియర్ ప్రపంచ కప్ ట్రోఫీని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గురువారం ఆవిష్కరించారు. ఈ టోర్నమెంట్ ఈ ఏడాది నవంబర్ 24 నుండి డిసెంబర్ 5 వరకు జరుగుతుంది. ఈ సందర్భంగా దేశంలో హాకీ క్రీడ అభివృద్ధి కోసం ఒడిశా రాష్ట్రం చేస్తున్న కృషిని నవీన్ పట్నాయక్ వివరించారు. గత పదేండ్లుగా దేశంలో హాకీ అభివృద్ధి కోసం ఇండియా హాకీ ఫెడరేషన్తో కలిసి పని చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా 2018 నుండి జాతీయ హాకీ జట్లకు స్పాన్సర్ చేస్తున్నట్లు చెప్పారు. హాకీ వరల్డ్ కప్తో సహా ప్రధాన టోర్నమెంట్లకు హోస్ట్గా ఉన్నట్లు వివరించారు.
ఈ ప్రయత్నాల వల్ల ఇటీవలి టోక్యో ఒలింపిక్స్లో భారత పురుషుల, మహిళల హాకీ జట్లు చారిత్రక విజయాన్ని సాధించాయని సీఎం నవీన్ పట్నాయక్ తెలిపారు. భారత హాకీకి పూర్వ వైభవం తిరిగి వచ్చిందని స్పష్టమవుతోందని కొనియాడారు. రాబోయే కాలంలో భారత హాకీ సాధించనున్న విజయాల గురించి చాలా ఉత్కంఠగా ఉందన్నారు.
2023 జనవరిలో జరుగనున్న హాకీ వరల్డ్ కప్ ఒక మైలురాయి ఈవెంట్ అని నవీన్ పట్నాయక్ తెలిపారు. దేశంలో హాకీ అభివృద్ధికి ఇది మరింత ఊపునిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రయాణంలో ఒడిశా కొనసాగుతుందని అన్నారు. మరో 10 సంవత్సరాలు భారత హాకీ జాతీయ జట్లకు సంపూర్ణ మద్దతు ఇస్తామని తాము ఇప్పటికే ప్రకటించిన సంగతిని ఆయన గుర్తు చేశారు.