భారత్ – పాకిస్తాన్ మధ్య ఇటీవలే ముగిసిన హైఓల్టేజ్ మ్యాచ్ తర్వాత పాక్ క్రికెట్ టీమ్ డైరెక్టర్ మికీ ఆర్థర్ చేసిన కామెంట్స్పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) స్పందించింది. అహ్మదాబాద్ వేదికగా గత శనివారం ముగిసిన మ్యాచ్ను సుమారు లక్ష మంది వీక్షించగా ఇందులో పాకిస్తాన్ అభిమానులను అనుమతించలేదు. దీనిపై ఆర్థర్ స్పందిస్తూ.. ఇది ఐసీసీ ఈవెంట్లా లేదని, బీసీసీఐ ద్వైపాక్షిక సిరీస్ నిర్వహించినట్టుగా ఉందని వ్యాఖ్యానించాడు.
తాజాగా ఆర్థర్ వ్యాఖ్యలపై ఐసీసీ స్పందించింది. ‘ప్రతి ప్రపంచకప్లో మేము ఇలాంటి విమర్శలు ఎదుర్కుంటూనే ఉంటాం. మేం వాటిని అంతగా పట్టించుకోం. మరింత ఉత్తమంగా ఈ మెగా టోర్నీని ఎలా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటాం. 2023 వన్డే వరల్డ్ కప్ కొద్దిరోజుల క్రితమే మొదలైంది. ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. ఈ టోర్నీని మరింత మెరుగ్గా నిర్వహించేందుకు ఏ విధమైన మార్పులు చేయాలి..? అనేదానిపై ఆలోచిస్తాం. ప్రస్తుత భారత్లో జరుగుతున్న టోర్నీని కచ్చితంగా అత్యుత్తమ వరల్డ్ కప్గా నిలుస్తుందని మా నమ్మకం..’ అని ఐసీసీ చీఫ్ గ్రెగ్ బార్క్లే తెలిపినట్టు సమాచారం.
కాగా ఈ మెగా టోర్నీకి భారత్.. భద్రతా కారణాల మేరకు పాకిస్తాన్ అభిమానులకు వీసాలు జారీ చేయలేదు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్దమన్న విమర్శలు వచ్చాయి. అయితే పాకిస్తాన్ క్రికెటర్లకే చివరి నిమిషం వరకూ వీసాలు మంజూరు కాలేదు.