అబుధాబి: చావో రేవో అనే మ్యాచ్లో తడబడి నిలబడిన న్యూజిల్యాండ్ అనూహ్యంగా పుంజుకుంది. 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆ జట్టు.. ఛేజింగ్ ప్రారంభంలోనే కీలకమైన గప్తిల్ (4), కేన్ విలియమ్సన్ (5) వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన కివీస్ గెలిచే అవకాశం ఉందా? అనే స్థితిలో ఉండగా డారియల్ మిచెల్ (68 నాటౌట్), జేమ్స్ నీషమ్ (11 బంతుల్లో 27) ఆ జట్టును ఒడ్డుకు చేర్చారు.
ముఖ్యంగా నీషమ్ బౌండరీలతో విరుచుపడి కివీస్ విజయానికి బాటలు వేశాడు. దీంతో అతను అవుటయ్యే సమయానికి 12 బంతుల్లో 20 పరుగులు కావాలి. అలాంటి సమయంలో మిచెల్ ఒక్కసారిగా రెచ్చిపోయాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో కీలకమైన వికెట్లు తీసిన వోక్స్ బౌలింగ్లో వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. అదే ఓవర్ చివరి బంతికి ఫోర్తో కివీస్కు విజయాన్నందించాడు.
ఛేజింగ్లో స్టార్ ప్లేయర్లను కోల్పోయిన కివీస్ను డారియల్తో కలిసి డెవాన్ కాన్వే (44) ఆదుకున్నాడు. రెండు వికెట్లు కోల్పోయిన తర్వాత మరో వికెట్ పడకుండా వీరిద్దరూ జాగ్రత్త పడ్డారు. అయితే వేగం పెంచే క్రమంలో కాన్వే అవుటయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే గ్లెన్ ఫిలిప్స్ (2) కూడా అవుటయ్యాడు.
అయితే ఆ తర్వాత వచ్చిన జేమ్స్ నీషమ్ చెలరేగి ఆడాడు. అతని ఇన్నింగ్స్లో మూడు సిక్సర్లు, ఒక ఫోర్ ఉన్నాయంటే అతను ఏ స్థాయిలో రెచ్చిపోయాడో అర్థం చేసుకోవచ్చు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు సంయమనంతో ఆడి, చివర్లో విజృంభించి విజయాన్ని కట్టబెట్టిన డారియల్ మిచెల్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.
ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, లియామ్ లివింగ్స్టన్ చెరో రెండు వికెట్లు కూల్చగా, అదిల్ రషీద్ ఒక వికెట్ పడగొట్టాడు. ఈ విజయంతో కివీస్ తొలిసారి టీ20 ప్రపంచకప్ ఫైనల్కు చేరింది. ఆదివారం నాడు దుబాయ్లో జరిగే ఫైనల్లో రెండో సెమీస్ విజేతను న్యూజిల్యాండ్ ఢీకొంటుంది.