అబుధాబి: స్వల్పలక్ష్య ఛేదనలో కివీస్ బ్యాట్స్మెన్ రాణిస్తున్నారు. ఓపెనర్లు మార్టిన్ గప్తిల్ (28), డారియల్ మిచెల్ (17) ఆ జట్టుకు శుభారంభం అందించారు. నాలుగో ఓవర్లో మిచెల్ అవుటైన తర్వాత కేన్ విలియమ్సన్ (10 నాటౌట్) క్రీజులోకి వచ్చాడు. వీరిద్దరూ కలిసి మరో వికెట్ పడకుండా ఆచితూచి ఆడుతున్నారు.
అయితే 9వ ఓవర్లో బంతి అందుకున్న రషీద్ ఖాన్ మార్టిన్ గప్తిల్ను బౌల్డ్ చేశాడు. టీ20 క్రికెట్లో అతనికి ఇది 400వ వికెట్ కావడం గమనార్హం. దీంతో కివీస్ జట్టు 9 ఓవర్లు ముగిసేసరికి 58/2 స్కోరుతో నిలిచింది. అంతకుముందు కివీస్ బౌలర్ల ధాటికి అల్లాడిన ఆఫ్ఘనిస్థాన్ 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.