అబుధాబి: న్యూజిల్యాండ్తో జరుగుతున్న కీలకమైన మ్యాచ్లో ఆఫ్ఘన్ బ్యాట్స్మెన్ తడబడ్డారు. నాణ్యమైన న్యూజిల్యాండ్ పేస్ దళాన్ని ఎదుర్కోవడానికి నానా తిప్పలూ పడ్డారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘన్ కెప్టెన్ నబీ నిర్ణయం బెడిసికొట్టింది. కివీస్ ముందు భారీ టార్గెట్ ఉంచుదామనుకున్న అతని ఆలోచన నెరవేరలేదు. ఆఫ్ఘన్ ఓపెనర్లు షెహజాద్ (4), జజాయ్ (2), రహ్మనుల్లా (6) ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్కు క్యూ కట్టారు.
కాసేపు నిలబడిన గుల్బాదిన్ నైబ్ (15) కూడా ప్రభావం చూపలేకపోయాడు. అయితే ఇలా కష్టాల్లో పడిన జట్టును నజిబుల్లా జద్రాన్ (73) ఆదుకున్నాడు. హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. అతనికి కాసేపు సహకారం అందించిన కెప్టెన్ మొహమ్మద్ నబీ (20 బంతుల్లో 14) కూడా రాణించలేదు. సౌథీ బౌలింగ్లో అతనికే రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. ఆ తర్వాత కాసేపటికే కరీమ్ జనత్ (2) అవుటయ్యాడు.
ఆఫ్ఘన్ ఇన్నింగ్స్ చివరి బంతికి రషీద్ ఖాన్ (3) కూడా కివీస్ కెప్టెన్ విలియమ్సన్కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి ఆఫ్ఘనిస్థాన్ జట్టు 8 వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది. కివీస్ బౌలర్లలో బౌల్ట్ 3, సౌథీ 2 వికెట్లు పడగొట్టారు. ఆడమ్ మిల్నే, ఇష్ సోధీ, జేమ్స్ నీషమ్ తలో వికెట్ కూల్చారు.