న్యూఢిల్లీ: మరో ఐదు రోజుల్లో వన్డే ప్రపంచకప్ 2023 ప్రారంభం కానుంది. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే తొలి పోరుతో ప్రపంచకప్ మహా సంగ్రామానికి తెర లేవనుంది. ఈ వన్డే ప్రపంచకప్ భారత్లోనే జరుగుతుండటంతో ఈసారి టీమిండియానే కప్పు కొడుతుందని అభిమానులు గంపెడు ఆశతో ఉన్నారు. అయితే భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ మాత్రం భారత్కు అంత సీన్ లేదన్నట్టుగా కామెంట్ చేశాడు.
వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ షోలో పాల్గొన్న గవాస్కర్.. ప్రపంచకప్ గెలిచే జట్టును అంచనా వేసాడు. ‘వన్డే ప్రపంచకప్ 2023ను డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ సొంతం చేసుకుంటుంది. ఎందుకంటే టైటిల్ గెలిచే సత్తా ఆ జట్టుకు మాత్రమే ఉంది. బ్యాటింగ్ విభాగం, బౌలింగ్ విభాగం అద్భుతంగా ఉంది’ అని గవాస్కర్ వ్యాఖ్యానించాడు.
మ్యాచ్ను మలుపు తిప్పగల ఆల్ రౌండర్లు ఇంగ్లండ్ జట్టులో ఉన్నారని, బలమైన బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ ఉన్న ఇంగ్లండ్ను ప్రపంచకప్లో నిలువరించడం ఎవరి వల్ల అయ్యే పని కాదని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. గత ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్లో ఇంగ్లండ్ విజేతగా నిలిచింది. ప్రస్తుతం ఇంగ్లండ్ బజ్ బాల్ క్రికెట్తో ప్రత్యర్థులకు వణుకు పుట్టిస్తోంది.
ఈ సారి కూడా ఇంగ్లండ్ విజేతగా నిలిస్తే వరుసగా రెండు ఎడిషన్స్ లో ప్రపంచకప్ నెగ్గిన మూడో జట్టుగా ఇంగ్లండ్ నిలుస్తుంది. గతంలో వెస్టిండీస్ (1975, 1979), ఆస్ట్రేలియా (1999, 2003, 2007) మాత్రమే ఈ ఘనతను సాధించాయి. అయితే భారత మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ మాత్రం ఈ సారి ప్రపంచకప్ను భారత్ గెలుస్తుందని పేర్కొన్నాడు.
ప్రస్తుతం భారత్ సూపర్ ఫామ్లో ఉందని అతడు పేర్కొన్నాడు. బుమ్రా రాకతో బౌలింగ్ బలంగా ఉందన్నాడు. కాగా, భారత్ తన టైటిల్ వేటను అక్టోబర్ 8న ఆరంభించనుంది. చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే పోరుతో భారత్ ప్రపంచకప్ ప్రయాణాన్ని ఆరంభిస్తుంది. టీమిండియా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లను టైటిల్ ఫేవరెట్స్ గా క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.