Kumar Sangakkara : టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీపై శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర ప్రశంసలు కురిపించాడు. స్పోర్ట్స్ తక్ ఛానెల్తో సంగక్కర మాట్లాడాడు. గత కొన్నాళ్లుగా కోహ్లీలో వచ్చిన మార్పులు, మునపటిలా అతను బౌలర్లపై విరుచుకుపడుతున్నట్టు కనిపించడం లేదు? అనే ప్రశ్నలకు అతను స్పందించాడు. ‘కోహ్లీ ఆటలో పదును తగ్గిందంటే నేను ఒప్పుకోను. అతను టీమిండియాకు మరిన్ని విజయాలు అందించగలడు. కోహ్లీ ఇంకా తానేంటో నిరూపించుకోవాల్సింది ఏం లేదు. అతను పనిభారాన్ని ఎలా మేనేజ్ చేస్తాడో తెలుసుకోవాలని ఉంది. ఎందుకంటే.. భారత్కు ఆడే ప్రతిసారి కోహ్లీ పరుగుల దాహంతో కనిపిస్తాడు. ప్రతి మ్యాచ్ గెలవాలని ప్రయత్నిస్తాడు. అయితే.. అతడిని అన్ని ఫార్మాట్లలో ఆడించడం, ప్రతిసారి అతడి నుంచి పరుగులు ఆశించడం అనేది సరికాదు’ అని సంగక్కర తెలిపాడు.
‘కోహ్లీ కంటే ఎక్కువ క్రికెట్ మరొకరు ఆడలేరు. ఎంత ఫిట్గా ఉన్నా కూడా ఇతర ఆటగాళ్లు ఎక్కువ మ్యాచ్లు ఆడలేరు. కోహ్లీ చాలా టాలెంట్, స్కిల్ ఉన్న ఆటగాడు. అతను మైదానంలోకి దిగిన ప్రతిసారి ఒత్తిడి ఎదుర్కొంటాడు. కారణం ఏంటంటే.. అభిమానులు అతడు పరుగులు సాధించాలని కోరుకుంటారు అని ఈ శ్రీలంక దిగ్గజం అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం సంగక్కర రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీకి మెంటర్గా ఉన్నాడు.
పోయిన ఏడాది ఆసియా కప్లో ఫామ్ అందుకున్న కోహ్లీ టీ20 వరల్డ్ కప్లో అద్భుతంగా ఆడాడు. ఛేజింగ్ మాస్టర్గా పేరొందిన అతను పాకిస్థాన్పై ఆడిన (85 నాటౌట్) ఇన్నింగ్స్ కెరీర్లోనే ఉత్తమమైనది. బంగ్లాదేశ్తో మూడో వన్డేలో కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. అయితే.. మూడు ఫార్మాట్లలో ఆడుతుండడం వల్ల అతనిపై ఒత్తడి పడుతోంది. దాంతో, శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్కు కోహ్లీకి సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. మూడు వన్డేల సిరీస్కు ఈ స్టార్ ప్లేయర్ జట్టుతో కలవనున్నాడు.