ముంబై: ఇండియన్ క్రికెట్ టీమ్కు కోచ్ను వెతికే పనిలో ఉంది బీసీసీఐ. టీ20 వరల్డ్కప్తో రవిశాస్త్రి పదవీకాలం ముగుస్తుండటంతో అతని స్థానంలో కొత్త కోచ్ ఎవరన్న ఆసక్తి నెలకొంది. ద్రవిడ్, కుంబ్లేల పేర్లు వినిపించినా.. వాళ్లిద్దరూ దీనికి సుముఖంగా లేరని తేలడంతో విదేశీ కోచ్ ఖాయమని అనుకున్నారు. అయితే తాజాగా బీసీసీఐ వర్గాలు మాత్రం విదేశీ కోచ్ వచ్చే అవకాశమే లేదని చెప్పడం గమనార్హం. రానున్న హెడ్ కోచ్ కూడా ఇండియాకు చెందిన వాళ్లే ఉంటారని ఆ వర్గాలు తెలిపాయి.
నిజానికి ఐపీఎల్లోని 8 ఫ్రాంచైజీల్లో ఏడింటికి విదేశీ కోచ్లే ఉన్నారు. అయితే నేషనల్ టీమ్ విషయానికి వచ్చేసరికి మాత్రం ఈ ఫార్ములా పనిచేయదని బోర్డు వర్గాలు అంటున్నాయి. కొత్త హెడ్ కోచ్ ఇండియనే. ఐపీఎల్తో పోలిస్తే ఇండియన్ టీమ్ కోచింగ్ జాబ్ పూర్తిగా భిన్నమైనది. ఏడాది మొత్తం టీమ్తోనే ఉండాలి. ఆ విషయం చూస్తే ఇండియన్ కోచే బెటర్ అని ఆ వర్గాలు చెప్పాయి. ప్రస్తుతం ఐపీఎల్లో విజయవంతమైన కోచ్లుగా పేరున్న రికీ పాంటింగ్, మహేల జయవర్దెనెలాంటి వాళ్లు అంత సమయం ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు.
గతంలో నలుగురు విదేశీయులు ఇండియన్ టీమ్ కోచ్గా చేశారు. మొదట జాన్ రైట్, తర్వాత గ్రెగ్ చాపెల్, గ్యారీ కిర్స్టెన్, డంకన్ ఫ్లెచర్ కోచ్లుగా ఉన్నారు. మరోవైపు కుంబ్లే కోచ్గా తిరిగి వచ్చే అవకాశం లేదని కూడా బీసీసీఐ స్పష్టం చేసింది. గతంలో 2016-17 సమయంలోనూ కుంబ్లే కోచ్గా చేశాడు. అయితే కోహ్లితో పడక కుంబ్లే తన పదవికి రాజీనామా చేశాడు. ఇప్పుడు కూడా కోహ్లి కెప్టెన్గా ఉండటంతో కుంబ్లే వచ్చే అవకాశాలు లేవని ముందు నుంచీ వార్తలు వస్తున్నాయి.