న్యూఢిల్లీ: గాబ్రోన్(బోట్సావానా) వేదికగా వచ్చే నెల 2, 3 తేదీల్లో జరుగనున్న ప్రపంచ అథ్లెటిక్స్ రిలే టోర్నీలో భారత జట్టు బరిలోకి దిగనుంది. ఐదు విభాగాల్లో మొత్తం 21 మందితో కూడిన భారత బృందం పోటీపడనుంది. అనిమేశ్ కుజుర్ నాయకత్వం వహిస్తున్న జట్టులో ఎనిమిది మహిళా అథెట్లు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య(ఏఎఫ్ఐ) అధికార ప్రతినిధి అదిల్లె సుమరివాలా పేర్కొన్నాడు.
వాస్తవానికి ఆరు విభాగాల్లో పోటీపడాల్సి ఉన్నా..మహిళల 4X 400 టీమ్ను ఎంపిక చేయలేదు. ఇదిలా ఉంటే తెలంగాణ యువ అథ్లెట్ నిత్య గందె మహిళల 4X100 రిలేతో పాటు మిక్స్డ్ రిలే రేసులో బరిలోకి దిగుతున్నది. ఇటీవల జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న నిత్య..వరల్డ్ అథ్లెటిక్స్ రిలే టోర్నీలోనూ సత్తాచాటాలని చూస్తున్నది. తద్వారా రానున్న ఆసియాగేమ్స్తో పాటు కామన్వెల్త్ గేమ్స్ పూర్తి స్థాయిలో సిద్ధం కావాలని చూస్తున్నది.