హైదరాబాద్, ఆట ప్రతినిధి: కేరళ వేదికగా జరిగిన 57వ జాతీయ జిమ్నాస్టిక్స్ చాంపియన్షిప్లో రాష్ర్టానికి చెందిన నిక్ష అగర్వాల్ టైటిల్తో మెరిసింది. టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబరుస్తూ ఆల్రౌండ్ చాంపియన్షిప్ దక్కించుకుంది. తద్వారా బుద్దా అరుణారెడ్డి (2011) తర్వాత 12 ఏండ్లకు జాతీయ టైటిల్ దక్కించుకున్న తెలంగాణ ప్లేయర్గా నిక్ష నిలిచింది. హైదరాబాద్కు చెందిన ఈ 14 ఏండ్ల యువ జిమ్నాస్ట్ జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్నది. ఇటీవల జరిగిన సీబీఎస్ఈ జాతీయ జిమ్నాస్టిక్స్లో మూడు స్వర్ణాలు సహా ఈజిప్టు టోర్నీలో పసిడి, ఖేలో ఇండియాలో రజతం, జాతీయ జూనియర్ టోర్నీలో వెండి పతకం ఖాతాలో వేసుకుంది.మనోకుమార్ రానా దగ్గర శిక్షణ తీసుకుంటున్న నిక్ష .. త్వరలో జరుగబోయే ప్రపంచ జూనియర్ జిమ్నాస్టిక్స్ టోర్నీ లో పతకం సాధించాలన్న పట్టుదలతో ఉంది.