న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ అదరగొట్టింది. తాను బరిలోకి దిగనంత వరకే ఒక్కసారి పోటీకి దిగితే ప్రత్యర్థికి చుక్కలే అన్న రీతిలో చెలరేగింది. పవర్ పంచ్కు తిరుగులేదని మరోమారు ఘనంగా చాటిచెప్పిన ఈ ఇందూరు బాక్సర్ మెగాటోర్నీలో తొలిసారి పసిడి పోరుకు దూసుకెళ్లింది. పోటీపడుతున్నది దీటైన బాక్సర్లతో అయినా..ఎలాంటి తొణుకు బెణుకు లేకుండా ప్రత్యర్థి గుండెల్లో దడ పుట్టిస్తూ స్వర్ణ పతకానికి మరో అడుగు దూరంలో నిలిచింది. బుధవారం జరిగిన 52 కిలోల సెమీఫైనల్ బౌట్లో నిఖత్ జరీన్ 5-0 తేడాతో కరోలైన్ డీ అల్మెడా(బ్రెజిల్)ను మట్టికరిపించింది. ఆది నుంచి తనదైన దూకుడు ప్రదర్శించిన నిఖత్..బ్రెజిల్ బాక్సర్కు ఎక్కడా అవకాశమివ్వకుండా చెలరేగింది.
పదునైన పంచ్లకు తోడు జాబ్స్, హుక్స్తో ఉక్కిరిబిక్కిరి చేసింది. ఓవైపు తన ఎత్తును అనుకూలంగా మలుచుకుంటూ టెక్నికల్ గేమ్తో పంచ్లు కురిపించింది. తొలి రెండు రౌండ్లలో జోరు కనబరిచిన జరీన్ ఆఖరిదైన మూడో రౌండ్లో కరోలైన్కు ఒకింత ఎడం పాటిస్తూ వీలుచిక్కినప్పుడల్లా పంచ్లు విసిరింది. అప్పటికే వెనుకంజలో ఉన్న బ్రెజిల్ బాక్సర్ పుంజుకునే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. ఇదే అదనుగా విజృంభించిన నిఖత్ తన లక్ష్యమేంటో స్పష్టంగా చెప్పకనే చెప్పింది. ఇటీవలే స్ట్రాంజా బాక్సింగ్ టోర్నీలో స్వర్ణ పతకంతో మెరిసిన నిఖత్.. ప్రపంచ చాంపియన్షిప్లో పసిడి పతకమే తన లక్ష్యమని టోర్నీకి ముందే ప్రకటించింది. అందుకు అనుగుణంగా బౌట్ బౌట్కు ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తు చేస్తూ ఫైనల్కు చేరుకుంది. గురువారం జరిగే తుదిపోరులో థాయ్లాండ్కు చెందిన జిట్పాంగ్ జుటామస్తో అమీతుమీ తేల్చుకోనుంది. హోరాహోరీగా సాగిన మరో సెమీస్లో రెండు సార్లు ప్రపంచ చాంపియన్ కజకిస్థాన్కు చెందిన జైనా షెకర్బెకోవాను 4-1తో చిత్తుచేసిన జిట్పాంగ్ ముందంజ వేసింది.
ఓవైపు నిఖత్ జరీన్ ఫైనల్లోకి ప్రవేశించి కనీసం రజత పతకం ఖాయం చేస్తే.. వేర్వేరు సెమీస్ బౌట్లలో భారత్కు చెందిన మనీష (57కి) 0-5తో ఇర్మా టెస్టా (ఇటలీ) చేతిలో ఓటమిపాలైంది. ఆఖరి వరకు గెలుపు కోసం పోరాడినా.. మనీషకు నిరాశే ఎదురైంది. మరో పోరులో పర్వీన్ 1-4తో అమీ బ్రాడ్హస్ట్ (ఐర్లాండ్) చేతిలో ఓడి కాంస్య పతకం ఖాతాలో వేసుకుంది. టోక్యో ఒలింపిక్స్ తర్వాత జరుగుతున్న ఈ మెగాటోర్నీలో 73 దేశాల నుంచి 310 బాక్సర్లు పోటీపడుతున్నారు.
బ్రెజిల్ బాక్సర్ కరోలైన్ సహజమైన ఆటతీరును అడ్డుకోవడమే ఏకైక లక్ష్యంగా బరిలోకి దిగాను. గేమ్ నా వైపునకు తిప్పుకుంటూ రచించిన వ్యూహం ఫలించింది. టెక్నికల్గా ఆమెపై పైచేయి సాధిస్తూ పంచ్లు కొట్టడం పాయింట్ల పరంగా కలిసొచ్చింది. ఇదే రీతిలో ఫైనల్లో రాణిస్తాననే గట్టి నమ్మకం నాకుంది. పసిడి పతకంతో స్వదేశానికి రావడమే నా ధ్యేయం.
– నిఖత్ జరీన్