బర్మింగ్హామ్లో తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ శుభారంభం చేసింది. ఇటీవల ప్రపంచ చాంపియన్షిప్ స్వర్ణం నెగ్గి జోరుమీదున్న నిఖత్.. కామన్వెల్త్ గేమ్స్ క్వార్టర్ఫైనల్కు అర్హత సాధించింది. మహిళల 50 కేజీల విభాగంలో హలేనా ఇస్మాయిల్ (మొజాంబిక్)పై నిఖత్ ఏకపక్ష విజయం సాధించింది. తొలిసారి కామన్వెల్త్గేమ్స్ బరిలోకి దిగిన ఈ ఇందూరు అమ్మాయి.. ‘తొలి బౌట్ గెలువడం ఆనందంగా ఉంది. పతకానికి ఒక విజయం దూరంలో మాత్రమే ఉన్నానని తెలుసు. అయితే పసిడి పతకం సాధించడమే నా ఏకైక లక్ష్యం’ అని వెల్లడించింది. బౌట్ ఆరంభం నుంచే పదునైన పంచ్లతో విరుచుకుపడ్డ జరీన్కు.. ప్రత్యర్థి నుంచి ఎలాంటి ప్రతిఘటన ఎదురుకాలేదు. చివరి రౌండ్లో మరింత రెచ్చిపోయిన నిఖత్.. హలేనా ముఖంపై వరుస పంచ్లతో విజృంభించడంతో నిర్ణీత సమయం కంటే ముందే రిఫరీ బౌట్ నిలిపేసి తెలంగాణ బాక్సర్ను విజేతగా ప్రకటించాడు. క్వార్టర్స్లో గార్టన్ (న్యూజిలాండ్)తో నిఖత్ తలపడనుంది. మరోవైపు పురుషుల 63.5 కేజీల విభాగంలో భారత స్టార్ బాక్సర్ శివ థాపాకు అనూహ్య పరాజయం ఎదురైంది. ప్రిక్వార్టర్స్లో థాపా 1-4తో రిసీ లించ్ (స్కాట్లాండ్) చేతిలో ఓటమి పాలైయ్యాడు.