డునెడిన్: పాకిస్థాన్తో జరిగిన మూడవ టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్(Finn Allen) దుమ్మురేపాడు. 62 బంతుల్లో అతను 137 రన్స్ చేశాడు. పాక్ బౌలర్ రౌఫ్ వేసిన ఓ ఓవర్లో అతను ఏకంగా 27 పరుగులు రాబట్టాడు. అంతేకాదు ఈ ఇన్నింగ్స్లో అతను 16 సిక్సర్లు కొట్టాడు. గతంలో ఆఫ్ఘన్ బ్యాటర్ హజ్రతుల్లా బాదిన సిక్సర్లు రికార్డును సమం చేశాడు. డునెడిన్లో జరిగిన మ్యాచ్లో కివీస్ జట్టు 45 పరుగుల తేడాతో పాక్పై విజయం సాధించింది.
తొలుత టాస్ గెలిచిన పాకిస్థాన్ జట్టు బౌలింగ్ ఎంచుకున్నది. ఓవర్కాస్ట్ కండీషన్స్ తమకు ఫేవర్గా ఉన్నట్లు పాక్ కెప్టెన్ షాహీన్ షా అఫ్రిది తెలిపాడు. కివీస్ ఇన్నింగ్స్లో సీఫర్ట్ 31, ఫిలిప్స్ 19 రన్స్ చేశారు. పాక్ బౌలర్లలో హరీశ్ రౌఫ్ రెండు వికెట్లు తీసుకోగా, మిగితా బౌలర్లు చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. కివీస్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 224 రన్స్ చేసింది.
భారీ టార్గెట్తో చేజింగ్కు దిగిన పాకిస్థాన్ క్రమక్రమంగా వికెట్లను కోల్పోయింది. మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఒక్కడే హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అతను 8 ఫోర్లు, ఒక సిక్సర్తో 58 రన్స్ చేసి ఔటయ్యాడు. పాక్ ఏడు వికెట్లు కోల్పోయి 179 రన్స్ మాత్రమే చేసింది. టిమ్ సౌథీ రెండు వికెట్లు తీసుకున్నాడు. అయిదు మ్యాచ్ల సిరీస్లో కివీస్ 3-0 ఆధిక్యాన్ని సాధించింది.