ఇస్లామాబాద్: రావల్పిండిలో వన్డే మ్యాచ్ ప్రారంభానికి ముందు భద్రతా కారణాలతో న్యూజిలాండ్ తన టూర్ను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో 2003 తర్వాత మళ్లీ అంతర్జాతీయ మ్యాచ్లకు వేదిక అవుతుందనుకున్న పాకిస్థానీలకు తీవ్ర ఆవేదనే మిగిలింది. న్యూజిలాండ్ వ్యవహరించిన తీరు పట్ల పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిరుత్సాహంలోకి వెళ్లిన ఆ క్రికెటర్లు కివీస్ను తప్పుపడుతున్నారు. పాకిస్థాన్ క్రికెట్ను న్యూజిలాండ్ చంపేసిందని మాజీ ఫాస్ట్ బౌలర్ షోయెబ్ అక్తర్ ట్వీట్ చేశారు. రావల్పిండి నుంచి విషాదకర వార్తలు వస్తున్నట్లు అంతకుముందు ఆయన ఓ ట్వీట్లో చెప్పారు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ కూడా నిర్వేదాన్ని వ్యక్తం చేశారు. అకస్మాత్తుగా సిరీస్ను వాయిదా వేయడం బాధాకరమని, ఈ సిరీస్ జరిగితే లక్షలాది మంది పాక్ క్రికెట్ అభిమానులు సంతోషించేవారని, తమ సెక్యూర్టీ సామర్థ్యంపై నమ్మకం ఉన్నట్లు బాబర్ తన ట్వీట్లో చెప్పారు. న్యూజిలాండ్ తీసుకున్న నిర్ణయాన్ని మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రీది ఖండించారు. ఉత్తుత్తి బెదిరంపు కాల్తో కివీస్ టూర్ను రద్దు చేసుకుందని, దీని వల్ల ఎంత నష్టం అవుతుందో తెలుసా అని అఫ్రీది ట్వీట్ చేశారు.