డికాక్, లూయిస్ మెరుపులు
ఆహా.. ఏమా మ్యాచ్! ఆబ్బబ్బా.. ఏమా బాదుడు!! ఒకరిని మించి మరొకరు దంచికొట్టడంతో నిండా నలభై ఓవర్లు కాకుండానే 420 పరుగులు నమోదయ్యాయి!! ఇరు జట్ల ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో అభిమానులు పరుగుల పండుగ చేసుకున్నారు. లీగ్లో అత్యంత విజయవంతమైన జట్టుగా గుర్తింపు ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ను ఖంగు తినిపించిన అరంగేట్ర టీమ్ లక్నో సూపర్ జెయింట్స్ ఐపీఎల్లో తొలి విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
ముంబై: రెండు సూపర్ పవర్ల మధ్య జరిగిన పోరులో లక్నో సూపర్ జెయింట్స్దే పైచేయి అయింది. బ్యాటర్లు బాదుడే పరమావధిగా చెలరేగిన పోరులో విజయం సాధించిన లక్నో పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచింది. తొలి మ్యాచ్లో గుజరాత్ చేతిలో ఓడిన లక్నో.. గురువారం జరిగిన పోరులో 6 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. ఓపెనర్ రాబిన్ ఊతప్ప (27 బంతుల్లో 50; 8 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధశతకంతో మెరువగా.. శివమ్ దూబే (30 బంతుల్లో 49; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), మోయిన్ అలీ (22 బంతుల్లో 35; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), అంబటి రాయుడు (27; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు.
ఆఖర్లో తాజా కెప్టెన్ రవీంద్ర జడేజా (17; 3 ఫోర్లు), మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ (6 బంతుల్లో 16 నాటౌట్; 2 ఫోర్లు, ఒక సిక్స్) మెరుపులు మెరిపించారు. క్రీజులో అడుగుపెట్టడంతోనే భారీ సిక్సర్ కొట్టిన మహేంద్రుడు అభిమానులను ఉర్రూతలూగించాడు. లక్నో బౌలర్లలో రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, ఆండ్రూ టై తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో లక్నో 19.3 ఓవర్లలో 4 వికెట్లకు 211 పరుగులు చేసింది. డికాక్ (61; 9 ఫోర్లు), లూయిస్ (23 బంతుల్లో 55 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్సెంచరీలు బాదితే.. కెప్టెన్ కేఎల్ రాహుల్ (40; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆయుశ్ బదోనీ (9 బంతుల్లో 19 నాటౌట్; 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. బౌలర్లను సరైన రీతిలో వినియోగించుకోలేకపోయిన చెన్నై సారథి జడేజా అందుకు తగ్గ మూల్యం చెల్లించుకున్నాడు. లూయిస్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఐపీఎల్ 15వ సీజన్లో భాగంగా శుక్రవారం కోల్కతాతో పంజాబ్ తలపడనుంది.
సంక్షిప్త స్కోర్లు
చెన్నై: 20 ఓవర్లలో 210/7 (ఊతప్ప 50, దూబే 49; బిష్ణోయ్ 2/24, అవేశ్ 2/38), లక్నో: 19.3 ఓవర్లలో 211/4 (డికాక్ 61, లూయిస్ 55 నాటౌట్; ప్రిటోరియస్ 2/31).