ముంబై: ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ చూసి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు ఇండియన్ టీమ్ మాజీ క్రికెటర్ సురేశ్ రైనా. మంగళవారం ఐపీఎల్ వాయిదా పడిన తర్వాత అతడో ట్వీట్ చేశాడు. ఇది ఇక ఎంతమాత్రం జోక్ కాదు. ఎన్నో జీవితాలు పణంగా ఉన్నాయి. జీవితంలో ఎప్పుడూ ఇంత నిస్సహాయంగా లేను. మనం ఎంత సాయం చేద్దామని అనుకున్నా సరే. మన దగ్గర ఉన్న వనరులు అయిపోతున్నాయి. ప్రాణాలను కాపాడటానికి ఒకరికొకరు చేయూతగా నిలుస్తున్న దేశంలోని ప్రతి పౌరుడికి సెల్యూట్ అని రైనా ఎమోషనల్ అయ్యాడు.
ఐపీఎల్లో కఠినమైన బయో బబుల్ను కూడా ఛేదించి వైరస్ క్రికెటర్లకు సోకిన విషయం తెలుసు కదా. రోజుకో ప్లేయర్ వైరస్ బారిన పడుతుండటంతో ఇక లాభం లేదనుకొని ఐపీఎల్ను వాయిదా వేసింది బీసీసీఐ. ఇప్పటికే ఇండియాలో కరోనాపై పోరులో భాగంగా సచిన్తోపాటు ధావన్, పాండ్యా బ్రదర్స్, జైదేవ్ ఉనద్కట్లాంటి క్రికెటర్లు తమ వంతు సాయం చేశారు.