హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్లో మరో మ్యాచ్ ఆతిథ్యానికి హైదరాబాద్ సిద్ధమైంది. మెగాటోర్నీలో భాగంగా సోమవారం నెదర్లాండ్స్, న్యూజిలాండ్ మధ్య ఉప్పల్ రాజీవ్గాంధీ స్టేడియంలో మ్యాచ్ జరుగనుంది. టోర్నీ ఆరంభ పోరులో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్పై ఘనవిజయం సాధించిన న్యూజిలాండ్ సమరోత్సాహంలో ఉంటే.. పాకిస్థాన్తో ఉప్పల్లోనే ఆడిన తొలి మ్యాచ్లో చక్కటి పోరాటంతో ఆకట్టుకున్న నెదర్లాండ్స్ మరోసారి సేమ్ సీన్ రిపీట్ చేయాలని చూస్తున్నది. వరల్డ్కప్ తొలి మ్యాచ్లో ఇంగ్లిష్ జట్టు నిర్దేశించిన 283 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ టీమ్ కేవలం 36.2 ఓవర్లలోనే ఛేదించి ప్రత్యర్థులకు ప్రమాద హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా.. న్యూజిలాండ్ రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ పూర్తి స్థాయిలో కోలుకోపోవడంతో ఈ మ్యాచ్ బరిలోకి దిగడం అనుమానంగా కనిపిస్తున్నది. అతడి గైర్హాజరీలో వికెట్ కీపర్ టామ్ లాథమ జట్టుకు సారథ్యం వహించనున్నాడు.