న్యూఢిల్లీ: ఒలింపిక్స్ అథ్లెటిక్స్లో ఇండియాకు తొలి గోల్డ్ మెడల్ సాధించి పెట్టిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా( Neeraj Chopra ) పాపులారిటీ విపరీతంగా పెరిగిపోయింది. అతడో నేషనల్ హీరో అయిపోయాడు. క్రికెటర్లను మించి ఫాలోయింగ్ ఇప్పుడతని సొంతమైంది. అయితే బయటే కాదు సోషల్, డిజిటల్ మీడియాల్లోనూ నీరజ్ విలువ భారీగా పెరిగిపోయింది. టోక్యో ఒలింపిక్స్ సందర్భంగా ఇన్స్టాగ్రామ్లో అత్యధికంగా ప్రస్తావించిన అథ్లెట్గా నీరజ్ రికార్డు సృష్టించాడు. ఒలింపిక్స్ సమయంలో మొత్తం 14 లక్షల మంది 29 లక్షలసార్లు ఇన్స్టాగ్రామ్లో నీరజ్ పేరును ప్రస్తావించడం విశేషం.
YouGov SPORT అనే కన్సల్టెన్సీ చేసిన రీసెర్చ్లో ఈ విషయం తేలింది. ఆన్లైన్లో అతని పేరు ప్రస్తావించిన రేటు 2055 శాతం పెరిగినట్లు ఇందులో తేలింది. దీంతో సోషల్, డిజిటల్ మీడియాలో నీరజ్ రీచ్ 41.2 కోట్లకు చేరింది. ఇది కాస్తా అతని సోషల్ మీడియా విలువను రూ.428 కోట్లకు తీసుకెళ్లింది. గోల్డ్ గెలిచినప్పటి నుంచీ సోషల్ మీడియాలో నీరజ్ చోప్రా గురించి చర్చల సంఖ్య 1.27 కోట్లకు చేరుకుంది. అతనికి సంబంధించిన వీడియోలకు కూడా వ్యూస్ క్రమంగా పెరుగుతూ వచ్చాయి. సోషల్ మీడియాలో ఓ ఇండియన్ అథ్లెట్కు ఉండే సగటు వ్యూస్ కంటే మూడు రెట్లు ఎక్కువగా అంటే 40 లక్షలకు చేరింది. ఇక ఇన్స్టాగ్రామ్లో అతని ఫాలోవర్ల సంఖ్య 45 లక్షలు దాటింది. అంతకుముందు కంటే ఇది 2297 రెట్లు ఎక్కువ కావడం విశేషం.