నాయక ద్వయం అద్వితీయ ప్రదర్శనతో చెలరేగిన వేళ.. అండర్-19 ప్రపంచకప్ సెమీఫైనల్లో యువ భారత్ భారీ స్కోరు చేసింది. అజేయంగా సెమీస్లో అడుగుపెట్టిన యంగ్ఇండియా.. కీలక పోరులోఓపెనర్లు విఫలమైనా.. కెప్టెన్ యష్ ధుల్ సెంచరీ.. వైస్ కెప్టెన్, తెలుగు ఆటగాడు షేక్ రషీద్ హాఫ్ సెంచరీతో కదం తొక్కడంతో ఆస్ట్రేలియాపై పూర్తి ఆధిపత్యం కనబర్చింది!
అంటిగ్వా: కెప్టెన్ యష్ ధుల్ (110 బంతుల్లో 110; 10 ఫోర్లు, ఒక సిక్సర్) శతకానికి.. వైస్ కెప్టెన్ షేక్ రషీద్ (94; 8 ఫోర్లు, ఒక సిక్సర్) బాధ్యతాయుత ఇన్నింగ్స్ తోడవడంతో ఆస్ట్రేలియాతో అండర్-19 ప్రపంచకప్లో యంగ్ఇండియా భారీ స్కోరు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న యువ భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసింది. ఓపెనర్లు రఘువంశీ (6), హర్నూర్ సింగ్ (16) ఎక్కువసేపు నిలువలేకపోయినా.. యష్, రషీద్ మూడో వికెట్కు 204 పరుగులు జోడించి ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. నిలదొక్కుకునేందుకు ఎక్కువ సమయం తీసుకున్న ఈ జోడీ.. ఒక్కసారి క్రీజులో కుదురుకున్నాక ఆసీస్ బౌలర్లను ఓ ఆటాడుకుంది. ఈ క్రమంలో ధుల్ 106 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకోగా.. తెలుగు ఆటగాడు షేక్ రషీద్ సెంచరీకి ఆరు పరుగుల దూరంలో కంగారూ ఫీల్డర్ పట్టిన వివాదాస్పద క్యాచ్కు పెవిలియన్ చేరాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో జాక్ నిస్బెట్, సాజ్మన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. మరో సెమీఫైనల్లో అఫ్గానిస్థాన్పై 15 పరుగుల తేడాతో గెలిచిన ఇంగ్లండ్ 24 ఏండ్ల తర్వాత ఈ టోర్నీ ఫైనల్కు చేరింది.
ఒక దశలో 241/2తో అత్యంత పటిష్ట స్థితిలో నిలిచిన యంగ్ ఇండియా మరింత భారీ స్కోరు చేసేలా కనిపించినా.. వరుస బంతుల్లో యష్, రషీద్ ఔట్ కావడంతో కాస్త ఇబ్బంది పడింది. రషీద్ కొట్టిన బంతి బౌలర్ చేతికి తాకుతూ నాన్స్ట్రయికర్ ఎండ్లోని వికెట్లను గిరాటేయగా.. అప్పటికే పరుగు కోసం ముందుకొచ్చిన యష్ రనౌటయ్యాడు. ఆ మరుసటి బంతికే రషీద్ క్యాచ్ ఔట్గా డగౌట్ బాట పట్టాడు. దీంతో 49 ఓవర్లు ముగిసేసరికి యంగ్ఇండియా 263/5తో నిలిచింది. ఇక్కడి నుంచి మరో పది, పదిహేను పరుగులు చేస్తుందేమో అనుకుంటే.. దినేశ్ (4 బంతుల్లో 20 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), నిశాంత్ (12 నాటౌట్; ఒక ఫోర్, ఒక సిక్సర్) భారీ షాట్లతో విరుచుకుపడటంతో ఏకంగా 27 పరుగులు పిండుకుంది.