హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ వేదికగా ఈనెల 27 నుంచి జాతీయ ట్రాక్ సైక్లింగ్ చాంపియన్షిప్ ప్రారంభం కానుం ది. దేశంలోని వివిధ రాష్ర్టాల నుంచి దాదాపు 700 మందికి పైగా సైక్లిస్టులు పోటీకి దిగుతున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టోర్నీ కోసం తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయ, సహకారాలు అందిస్తున్నది. టోర్నీలో పాల్గొంటున్న వారి కోసం ప్రత్యేకమైన వసతి, భోజన సౌకర్యాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్ ప్రతినిధులు బుధవారం మీడియా సమావేశంలో పేర్కొన్నారు. రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ముఖ్య అతిథిగా పోటీలను ప్రారంభిస్తారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, రాష్ట్ర సైక్లింగ్ సంఘం అధ్యక్షుడు మల్లారెడ్డి, ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ రాజ్కుమార్, ఉపాధ్యక్షుడు లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.