హిసార్: జాతీయ బాక్సింగ్ చాంపియన్షిప్లో రాష్ట్ర యువ బాక్సర్ మహమ్మద్ హుసాముద్దీన్ పసిడి వెలుగులు విరజిమ్మాడు. శుక్రవారం జరిగిన పురుషుల 57కిలోల ఫైనల్ బౌట్లో హుసామ్ 4-1 తేడాతో సచిన్(ఆర్ఎస్పీబీ)పై అద్భుత విజయం సాధించాడు. గతేడాది ఫైనల్లో ఓటమిచవిచూసిన ఈ ఇందూరు బాక్సర్ ఈసారి పసిడి పతకాన్ని ముద్దాడాడు. ఓవైపు ప్రత్యర్థి నుంచి దీటైన పోటీ ఎదురైనా వెరువకుండా పదునైన పంచ్లతో సమాధానమిచ్చాడు. తన ఎత్తును అనుకూలంగా మలుచుకుంటూ పవర్ఫుల్ పంచ్లకు తోడు జాబ్స్, హుక్స్తో సచిన్ను ఉక్కిరిబిక్కిరి చేయడంలో సఫలమయ్యాడు. సచిన్ పుంజుకునేందుకు ప్రయత్నించినా..మూడు రౌండ్లలో తనదైన ఆధిపత్యాన్ని ప్రదర్శించిన హుసామ్..రిఫరీల నుంచి కీలక పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు. బర్మింగ్హామ్ కామన్వెల్త్ గేమ్స్లో కాంస్య పతకం సాధించిన హుసామ్ జాతీయ స్థాయిలోనూ తనకు తిరుగులేదని చాటాడు. మరోవైపు శివతాపా, ఆకాశ్, సుమిత్, వరిందర్సింగ్ స్వర్ణ పతకాలతో మెరిశారు. డిఫెండింగ్ చాంపియన్ సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు(ఎస్ఎస్సీబీ) పది పతకాలతో టాప్లో నిలువగా ఆర్ఎస్పీబీకి రెండు స్వర్ణాలు, మూడు రజతాలు, రెండు కాంస్యాలతో రెండో స్థానం దక్కగా, పంజాబ్(స్వర్ణం, రెండు రజతాలు, ఆరు కాంస్యాలు) మూడులో నిలిచింది.