హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ స్టార్ అథ్లెట్ అగసర నందిని మరోమారు అంతర్జాతీయ వేదికపై సత్తాచాటింది. కొలంబియా వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ప్రపంచ అండర్-20 జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో నందిని కొత్త చరిత్ర లిఖించింది. మహిళల 100 మీటర్ల హర్డిల్స్లో ఫైనల్ చేరిన తొలి భారత అథ్లెట్గా అరుదైన రికార్డు నెలకొల్పింది. శుక్రవారం అర్ధరాత్రి(భారత కాలమానం ప్రకారం) జరిగిన సెమీస్ రేసును నందిని 13.34 సెకన్లలో ముగించి తుది పోరుకు అర్హత సాధించింది. ఈ క్రమంలో తన పేరిట ఉన్న జాతీయ రికార్డు(13.58సె) రికార్డును 24 గంటల వ్యవధిలో తుడిచిపెట్టింది. ట్రాక్పై చిరుతను తలపించిన నందిని కనురెప్ప తెరిచే లోగా లక్ష్యాన్ని ముద్దాడింది. ఫైనల్లో సత్తాచాటి దేశానికి పతకం అందించడమే తన లక్ష్యమని రేసు ముగిసిన తర్వాత ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. ప్రపంచ చాంపియన్షిప్లో అంచనాలకు మించి రాణిస్తున్న ఎస్సీ గురుకుల విద్యార్థి నందినిని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, సొసైటీ కార్యదర్శి రొనాల్డ్ రోస్ ప్రత్యేకంగా అభినందించారు.