రమావత్ కోటేశ్వర్ నాయక్ కేరాఫ్ నల్లగొండ జిల్లా. దేవరకొండ నియోజకవర్గం.. చెన్నంపేట మండలం గన్నెర్లపల్లి గ్రామపంచాయతీలో ఓ నిరుపేద గిరిజన కుటుంబంలో పుట్టాడు. ఊహ తెలియని ఐదేండ్ల ప్రాయంలోనే పోలియో మహమ్మారి బారినపడటంతో కుడికాలు పడిపోయింది. ఓవైపు కష్టాలు నీడలా వెంటాడుతున్నా.. చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో ఆటలను ప్రాణంగా ప్రేమించాడు. వైకల్యం తన శరీరానికే కానీ ప్రతిభ కాదని నిరూపిస్తూ మారుమూల గిరిజన పల్లె నుంచి జాతీయస్థాయికి ఎదిగాడు. అన్నీ సరిగ్గా ఉన్న వాళ్లే ఆపసోపాలు పడుతున్న వేళ వైకల్యాన్ని అలవోకగా జయిస్తూ క్రికెట్తో పాటు బాస్కెట్బాల్లో అదరగొడుతున్నాడు. ఆటలో తాను ఎవరికీ తీసిపోనని నిరూపిస్తూ పోటీకి దిగిన ప్రతీ టోర్నీలో అద్భుత ప్రతిభ చాటుతూ తెలంగాణ ఖ్యాతిని ఇనుమడింపజేస్తున్న కోటేశ్వర్ నాయక్తో ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వ్యూ.
-నమస్తే తెలంగాణ క్రీడావిభాగం
మామూలుగా ఎవరైనా తాము ఎంచుకున్న క్రీడలో మెరుగైన ప్రతిభ చాటేందుకు ప్రయత్నిస్తారు. అందుకోసం అహర్నిశలు కష్టపడుతారు. తమ ప్రయాణంలో అవరోధాలు ఎదురైనా వెరువకుండా ముందుకు సాగుతారు. కోటేశ్వర్ నాయక్ విషయానికొస్తే ఓవైపు వైకల్యం ప్రతిబంధకంగా మారినా..ప్రతిభ చాటాలన్న ఏకైక లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు. అందుబాటులో ఉన్న పరిమిత వనరులతో అద్భుత విజయాలు సొంతం చేసుకున్నాడు. తాను అమితంగా ఇష్టపడే క్రికెట్, బాస్కెట్బాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగి ఔరా అనిపిస్తున్నాడు. ఇటీవల కోయంబత్తూరు (తమిళనాడు) వేదికగా జరిగిన సౌత్జోన్ వీల్చైర్ బాస్కెబాల్ టోర్నీలో కోటేశ్వర్ సత్తాచాటాడు. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి రాష్ర్టాలు పాల్గొన్న టోర్నీలో 99 గోల్ పాయింట్స్తో అత్యంత విలువైన ఆటగాడు (ఎమ్వీపీ) అవార్డు సొంతం చేసుకున్నాడు.
కోటేశ్వర్ నాయక్ బాస్కెట్బాల్ అరంగేట్రం అనుకోకుండా జరిగింది. తన జూనియర్ అయిన శంకర్ బాబు సాయంతో కోట్ల విజయభాస్కర్రెడ్డి ఇండోర్ స్టేడియంలో సోహల్ఖాన్ దగ్గర కోచింగ్ తీసుకున్నాడు. తొలుత బాస్కెట్బాల్ ఆడేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. దవాఖానల్లో వాడే మెడికల్ వీల్చైర్తో బాస్కెట్బాల్ ఆడటం మొదలుపెట్టాడు. ఎలాగైనా సత్తాచాటాలన్న కసితో బరిలోకి దిగిన తొలి జాతీయస్థాయి టోర్నీలోనే ఆకట్టుకున్నాడు. అయితే మేజర్ టోర్నీల్లో ఆడాలంటే వీల్చైర్ తప్పనిసరి సరైన పరిస్థితుల్లో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (సాట్స్) అండగా నిలిచింది. అప్పటి సాట్స్ ఎండీ ఉన్న దినకర్బాబు తమకు వీల్చైర్స్ అందించాడని కోటేశ్వర్ పేర్కొన్నాడు. అప్పటి నుంచి ఆటపై మరింత మక్కువ పెంచుకున్న నాయక్..2019లో మెరుగైన ప్రదర్శన కనబరిచి తొలిసారి భారత జట్టుకు ఎంపికయ్యాడు. పట్టాయ (థాయ్లాండ్)లో జరిగిన ఆసియా ఓషియానియా చాంపియన్షిప్లో భారత్ తరఫున బరిలోకి దిగి ఆకట్టుకున్నాడు.
ఓవైపు బాస్కెట్బాల్లో రాణిస్తూనే కోటేశ్వర్ క్రికెట్లోను మెరుపులు మెరిపిస్తున్నాడు. ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ పూర్తి చేసిన తర్వాత తొలుత క్రికెట్ను కెరీర్గా ఎంచుకున్న ఈ 30 ఏండ్ల యువకుడు అంచలంచెలుగా ఎదిగాడు. ఇటీవల హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన దివ్యాంగుల ప్రీమియర్ లీగ్(డీడబ్ల్యూపీఎల్)ఆల్రౌండ్ ప్రదర్శనతో మ్యాన్ ఆఫ్ ద సిరీస్గా నిలిచాడు. ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న ఇండియన్ వీల్చైర్ ప్రీమియర్ లీగ్ (ఐడబ్ల్యూపీఎల్)లోనూ రాణిస్తున్నాడు.
అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న కోటేశ్వర్ నాయక్ది నిరుపేద కుటుంబం. కష్టపడి పనిచేసుకుంటే తప్ప పూటగడువని పరిస్థితి. తమకున్న వ్యవసాయ భూమి ద్వారా పొట్ట నింపుకునే వైనం వారిది. తావుర్య నాయక్, భారతి దంపతులకు కోటేశ్వర్ రెండో సంతానం. ఆర్థికంగా తనకు మద్దతుగా నిలిస్తే భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధిస్తానని నాయక్ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు.