హాంగ్జౌ: చైనాలో జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో భారత్కు పతకాల పంట పండుతూనే ఉన్నది. బుధవారం జరిగిన పురుషుల 5000 మీటర్ల పరుగు పందెం ఫైనల్ ఈవెంట్లో భారత్ అథ్లెట్, నాయబ్ సుబేదార్ అవినాష్ సాబిల్ రెండో స్థానంలో నిలిచి రజత పతకం సొంతం చేసుకున్నాడు. బహ్రెయిన్కు చెందిన బాలివ్ బిర్హాణి యెమతా, అడ్మాసు దవిత్ ఫికాడు వరుసగా బంగారు, కాంస్య పతకాలు నెగ్గారు.
ఇక మహిళల 800 మీటర్ల ఫైనల్ ఈవెంట్లో కూడా భారత్కు రజత పతకం దక్కింది. భారత అథ్లెట్ 25 ఏళ్ల బెయిన్స్ హర్మిలాన్ 2 నిమిషాల 3.75 సెకన్ల టైమింగ్తో రేసును పూర్తిచేసి రెండో స్థానంలో నిలవడం ద్వారా రజత పతకాన్ని సొంతం చేసుకుంది. శ్రీలంక అథ్లెట్ దిస్సనాయక ముదియన్సేలాకు బంగారు పతకం, చైనా అథ్లెట్ వాంగ్ చున్యూకు కాంస్య పతకం దక్కాయి.
కాగా, ఈ 19వ ఆసియా క్రీడల్లో భారత్ రికార్డు స్థాయిలో పతకాలను సాధించింది. ఇప్పటివరకు భారత్ జకర్తా ఆసియా క్రీడల్లో సాధించిన 70 పతకాలే అత్యధిక పతకాలు కాగా, బుధవారం ఉదయమే ఆ రికార్డు బద్ధలైంది. ఇప్పుడు పతకాల సంఖ్య 80కి చేరువైంది. పసిడి పతకాల సంఖ్య 16కు చేరింది. ఇంకా రెజ్లింగ్, జావెలిన్ త్రో, హాకీ, క్రికెట్లో భారత్కు పతకాలు వచ్చే అవకాశం ఉంది.